విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన సినిమా ‘విశ్వరూపం 2’ మొదటి నుంచి ఎన్నో వివాదాలతో మొదలైంది. 2013 లో వచ్చిన విశ్వరూపం కూడా ఎన్నో సంచలనాలు రేపుతు చివరికి థియేటర్లో విడుదలై మంచి విజయం సాధించింది. ఆ సినిమా సీక్వెల్ ‘విశ్వరూపం 2’ ఈ నెల 10న రిలీజ్ కానుంది. అయితే కమల్ హాసన్ నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘విశ్వరూపం 2’కు వ్యతిరేకంగా కేసు నమోదైంది. పిరమిడ్ సైమిర ప్రొడక్షన్స్ ఇంటర్నేషనల్ సంస్థ కమల్కు వ్యతిరేకంగా దావా వేసింది. కమల్ తమకు రూ.5.44 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉందని, అప్పటి వరకు ‘విశ్వరూపం 2’ విడుదల ఆపాలని డిమాండ్ చేసింది.
అంతే కాదు పిటిషన్ పరిశీలించిన మద్రాస్ హైకోర్టు కమల్కు నోటీసులు పంపింది. గతంలో ‘మర్మయోగి’సినిమా నిర్మాణ పనుల కోసం తమ సంస్థ 2016లో కమల్కు రూ.5.44 కోట్లు ఇచ్చిందని సదరు సంస్థ ఫిర్యాదులో పేర్కొంది. 2008 ఏప్రిల్ 2న రాజ్కమల్ ఫిల్మ్స్తో ఒప్పందం కుదుర్చుకొని సంతకాలు చేసినట్లు చెప్పింది. 2016లో రూ.5.44 కోట్లు ఇచ్చామని, ఇప్పుడు వడ్డీతో కలిపి మొత్తం రూ.7.75 కోట్లు అయ్యిందని పేర్కొంది. ఇదిలా ఉంటే..తమిళ బిగ్ బాస్2 వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కమల్పై.. షో సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జయలలితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇప్పటికే ఓ కేసు నమోదైన విషయం తెలిసిందే.
అప్పట్లో కమల్ హాసన్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో స్వయంగా ఆయన నటించి నిర్మించాలనుకున్న సినిమా ‘మర్మయోగి’. ఈ సినిమా బడ్జెట్ అప్పట్లోనే రూ.100 కోట్లతో తీయాలని భావించారు. కానీ, అప్పట్లో కొన్ని కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. తాజాగా ఈ వివాదం కోర్టుకు చేరింది. కమల్తో పాటు రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (విశ్వరూపం2 బ్యానర్)కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. సోమవారం (ఆగస్టు 6) లోగా దీనిపై వివరణ ఇవ్వాలని పిటిషన్ పరిశీలించిన అనంతరం.. జస్టిస్ సీవీ కార్తికేయన్ ఆదేశించారు.