సినీ పరిశ్రమలో కొన్ని హిట్లు వస్తే వాళ్ల రేంజ్ ఒక్క సారిగా పెరిగిపోతుంది. వద్దనే కొద్దీ అవకాశాలు వెల్లువలా వచ్చి పడతాయి. ఇప్పడూ ఇదే అదృష్టం హీరోయిన్ రష్మిక మందన కు వచ్చింది. 'ఛలో', 'గీత గోవిందం' సినిమాలతో ఆమె బిగ్ స్టార్గా మారింది. ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చ జరుగుతోంది. ఇప్పుడు టాలీవుడ్లో ఎవరినీ కదిపినా రష్మిక గురించే డిస్కషన్.
యూత్ కూడా ఈ బెంగుళూరు బ్యూటీపైనే మనస్సు పారేసుకున్నారు. మొదట ఛలో, ఇప్పుడు గీత గోవిందం సినిమాతో రష్మిక మందన్న అందరినీ ఆకట్టుకుంటోంది. రష్మిక తెలుగు సినీపరిశ్రమలో అడుగుపెట్టకముందే కన్నడ సినిమాల్లో మంచి పేరు తెచ్చుకుంది. బెంగుళూరులో పుట్టి పెరిగిన రష్మిక 'కిరాక్ పార్టీ' సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ సినిమాలో రష్మిక అందం, అభినయాన్ని చూసి డైరెక్టర్ పరశురాం పట్టుబట్టిమరీ గీత గోవిందం సినిమాలో ఆమెను హీరోయిన్గా తీసుకున్నాడట.
గీత గోవిందం సినిమాలో ఆమె మాట్లాడింది చాలా తక్కువ. కళ్ళతో ఇచ్చిన ఎక్సప్రషన్స్ చాలా ఎక్కువ. అందుకే ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారట. తన మొదటి సినిమా 'ఛలో'తోనే రష్మిక తెలుగు నేర్చేసుకుందట. వచ్చే నెలలో విడుదల కానున్న 'దేవదాస్' సినిమాలో రష్మిక నటిస్తోంది. మల్టీస్టారర్ సినిమా అయిన దేవదాస్లో నాని సరసన రష్మిక ప్రస్తుతం నటిస్తోందట. విజయ్ దేవరకొండతో మరో సినిమాలో నటించబోతోందట రష్మిక.