టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో ఎక్కడ లేని క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ కు అదృష్టం బాగానే కలిసి వస్తుంది. హీరోగా ‘పెళ్లిచూపులు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ తర్వాత నటించిన ‘అర్జున్ రెడ్డి’తో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. ఈ సినిమాలో తనదైన మానరీజం..అగ్రెసీవ్ గా నటించిన విజయ్ దేవరకొండ సినిమాలపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటించిన ‘గీతాగోవిందం’బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.
ఈ నెల 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. విడుదలైన ప్రతి చోటున విజయవిహారం చేస్తోంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ని అలరిస్తూ విజయ్ కెరీర్లో అత్యధిక కెలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ఇప్పటికే తన పేరు లిఖించుకున్న ఈ సినిమా తాజాగా మరో ఫీట్ సాధించింది. మొదటి అయిదు రోజుల్లోనే 50 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా తాజాగా 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈ విషయాన్ని తెలుపుతూ పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్.
ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న విజయ్ రేంజ్ కి 50 కోట్ల గ్రాస్ ను రాబట్టడం గ్రేట్ అనుకున్నారు.. తరువాత ఈ సినిమా వసూళ్లు తగ్గుముఖం పట్టొచ్చుననీ, 100 కోట్ల వరకూ వెళ్లకపోవచ్చుననే ప్రచారం జరిగింది. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ..ఇప్పటివరకు ‘గీత గోవిందం’ 102 కోట్ల రూపాయల గ్రాస్, 52 కోట్ల రూపాయల షేర్ రాబట్టారని పోస్టర్ ద్వారా తెలిపారు. ‘గీత గోవిందం’ భారత్ లోనే గాక ఓవర్సీస్ లోనూ సత్తా చాటుతోంది. ఈ జోరు ఇంకా కొనసాగే అవకాశం ఉందని, ‘గీత గోవిందం’ 125 కోట్లు చాలా సులువుగా రాబడుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.