ఈ మద్య వరుసగా బయోపిక్ సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్ లో ఇప్పటికే సినీ తారల పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’సినిమా ఘన విజయం సాధించింది. సావిత్రి జీవిత కథ తో తీసిన ఈ సినిమాలో కీర్తి సురేష్ అద్భుతమైన నటనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు కురిపించారు. ఇక బాలీవుడ్ లో రాజ్ ఇరానీ దర్శకత్వంలో వచ్చిన ‘సంజు’ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించింది. బాలీవుడ్ లో కాంట్రవర్సీల హీరో సంజయ్ దత్ బయోపిక్ పై వచ్చిన ‘సంజు’మంచి కలెక్షన్లు సాధించింది.
ఇప్పుడు తెలుగులో రాజకీయ నేపథ్యంలో కూడా బయోపిక్ లు వస్తున్నాయి. మహానటులు ఎన్టీఆర్ బయోపిక్ క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో తనదైన మార్క్ చాటుతూ తెలుగు ప్రజల మనసు దోచిన మహానాయకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ సినిమా తీస్తున్నారు. ఈ సినిమా మహి.వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. మమ్ముట్టి ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే 90 శాతం వరకూ చిత్రీకరణను జరుపుకుంది.
ఈ సినిమాకి సంబంధించి ఇంతవరకూ మమ్ముట్టి లుక్ మాత్రమే బయటికి వచ్చింది. ఆయన లుక్ వైఎస్ అభిమానులందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. వచ్చేనెల 2వ తేదీన వైఎస్ వర్ధంతి .. ఈ సందర్భంగా ఆ రోజు ఉదయం 7 గంటలకి ఈ సినిమా నుంచి 'సమరశంఖం' అనే లిరికల్ వీడియోను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ఈ రోజు విడుదల చేశారు. సంక్రాంతికి ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.