టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ (61) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విదితమే. బుధవారం ఉదయం 6 గంటలకు ఆయన ప్రయాణిస్తున్న వాహనం నల్లగొండ జిల్లా నార్కట్పల్లి-అద్దంకి రాష్ట్ర రహదారిపై అన్నెపర్తి వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. అయితే డ్రైవింగ్ సీట్లో ఉన్న హరికృష్ణ విసిరేసినట్లుగా గాల్లోకి ఎగిరారు. ప్రమాదస్థలి నుంచి 20 మీటర్ల దూరంలో ఓ కల్వర్టు పక్కన పడ్డారు. తల నేరుగా అక్కడ ఉన్న ఓ రాయికి తగలడంతో రక్తధారాల మధ్య అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. నార్కట్ పల్లి లోకి కామినేని హాస్పిటల్ కి తరలించి ఆయనకు చికిత్స చేస్తున్న సమయంలో కన్నుమూశారు.
అయితే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ‘ డ్రైవింగ్ చేస్తున్న కారులో సీటు బెల్టు పెట్టుకుని ఉంటే హరికృష్ణ బతికేవారు’ అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందిచిన ఆయన అభిమాని, దర్శకులు వైవీఎస్ చౌదరి ఘాటుగా స్పందించారు. హరికృష్ణతో 'సీతయ్య', 'లాహిరి లాహిరి లాహిరిలో' వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ఆయన ఓ టీవీ చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో హరికృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టారు. హరికృష్ణ సీటు బెల్ట్ పెట్టుకోలేదని ఇప్పుడు మాట్లాడడం అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
హరికృష్ణ చిన్నతనం నుంచే అన్ని రకాల వాహనాలనూ నడిపేవారని గుర్తు చేసిన ఆయన, అప్పటి వాహనాల్లో సీట్ బెల్ట్ ఉండేది కాదని, దాంతో ఆయనకు అలవాటు కాలేదని చెప్పారు. అయితే సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం ప్రమాదం అని ఆయనే పలు మార్లు హెచ్చరించేవారు..తను కూడా సీటు బెల్ట్ పెట్టుకొని ప్రయాణిస్తానని చెప్పారు. ఆయన పెద్ద కుమారుడు చనిపోయిన తర్వాత ఈ విషయాన్ని పలు మార్లు బహిరంగ వేధికల్లో కూడా చెప్పారు. ఎవరికీ ప్రమాదాలు జరగాలని ఉండదని, హరికృష్ణను దేవుడు పిలిచాడని అభిప్రాయపడ్డారు. సీటు బెల్టు గురించి మాట్లాడటం వృథా అని అన్నారు.