తమిళ సీనియర్ హాస్య నటుడు, మిమిక్రీ కళాకారుడు రాకెట్ రామనాథన్ (74) కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి 10 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఒరు పుల్లాంకుళల్ అడుప్పు ఊదుదు, స్పరిశం, వలత్తకడా, మన్సోరు, నామ్, వరం వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించారు రామనాథన్. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కలైమామణి అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.నటీనటుల సంఘం నుంచి ‘కలై సెల్వం’ అనే పురస్కారాన్ని అందుకున్నారు.
సీనియర్ మిమిక్రీ నటుడిగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. స్టేజీ ఆర్టిస్టుగా, మిమిక్రీ కళాకారుడిగా విశేష గుర్తింపు సంపాదించుకున్న రామనాథన్ ఆ తర్వాత చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. శివాజీ గణేశన్, ఎంజీఆర్, రజనీకాంత్, కమల హాసన్ తదితరుల గొంతును అనుకరించడంలో దిట్టగా పేరుగాంచారు. యాంటీ హిందీ వివాదంలో పాల్గొన్న రామనాథన్ 1970 సమయంలో ఆయన జైలుకి కూడా వెళ్ళారు.
అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబికులు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారని భార్య భానుమతి, కుమార్తె సాయిబాలా, కుమారుడు సాయిగురు బాలాజీలు అన్నారు. బుధవారం రాయపేటలో అంత్యక్రియలు జరిగాయి. రామనాథన్ మృతికి నటీనటుల సంఘం సంతాపం ప్రకటించింది. పలువురు నటీనటులు, దర్శకులు కూడా నివాళి అర్పించారు.