సాధారణంగా సినిమా హీరో అనగానే కష్టాల్లో ఉన్నప్రజలకు సహాయంగా ఉంటాడు..తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు.. హీరోయిన్ ప్రేమను గెల్చుకుంటాడు..విలన్ ని అంతం చేస్తాడు..ఇదే కాన్సెప్ట్ రోటీన్ గా కనిపిస్తుంటాయి. కానీ కొంత మంది హీరోలు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోలనిపించుకుంటారు. అలాంటి వారిలో మెగా హీరో అల్లు అర్జున్ ఒకరు. వెండితెరపై ఎంత స్టైలిష్గా ఉంటాడో.. బయటి ప్రపంచంలో సాటి మనుషుల మీద అంతే జాలిగా ఉంటాడు అల్లు అర్జున్.
ప్రకృతి వైపరీత్యాల కారణంగా.. ఉహించకుండానే బాధల్లోకి నెట్టబడి ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు నేనున్నానంటూ ఎప్పుడూ ముందుంటాడు అల్లు అర్జున్. ఆ మద్య చెన్నై, కేరళ వరదల్లో చిక్కుకొని సర్వస్వం కోల్పోయిన బాధితులకు సాయమందించిన ఈ చేతులు.. మరోసారి సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంలో తిత్లీ తుఫాన్ బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చాడు బన్నీ. గతంలోనూ బన్నీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలానే చేసాడు.
కొన్నేళ్ల కింద ఉత్తరాఖండ్ వరదలు వచ్చినపుడు 10 లక్షలు.. ఆ తర్వాత నాలుగేళ్ళ కింద హుధూద్ వచ్చినపుడు 20 లక్షలు.. చెన్నై ఫ్లడ్స్ వచ్చినపుడు 25 లక్షలు.. ఇక మొన్నటికి మొన్న కేరళ వరదలకు కూడా 25 లక్షలు ఇచ్చాడు అల్లు అర్జున్. తిత్లీ తుఫాన్ తో ప్రజలు అన్నీ కోల్పోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కూడు, గూడు లేక బిక్కుబిక్కుమంటున్నారు. ఇది చూసిన పలువురు ప్రముఖులు ఇప్పటికే వారి వారి విరాళాలను అందజేసి శ్రీకాకుళం ప్రజలకు అండగా నిలిచారు.
తాజాగా అల్లు అర్జున్ కూడా తన వంతుగా 25 లక్షల రూపాయలను తితిలీ బాధితుల సహాయార్థం అందజేస్తున్నానని ప్రకటించాడు. సాటి మానవుల పట్ల ఈయన చూపిస్తున్న జాలి.. మరెందరికో స్ఫూర్తిదాయకం అని చెప్పుకోవచ్చు. ఈయన ట్వీట్ చూసి ఏపి మంత్రి నారా లోకేష్ కూడా రిప్లై ఇచ్చాడు. తిత్లీ బాధితులకు మీ వంతు సాయం చేసినందుకు థ్యాంక్స్ చెప్పాడు.