భారత అడ్వర్టైజింగ్ పితామహుడిగా యాడ్ గురూగా గుర్తింపు పొందిన ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ ఆల్కే పదంసి(90) కన్నుమూశారు. 1982లో వచ్చిన హిస్టారికల్ డ్రామా ‘గాంధీ’లో మహమ్మద్ అలీ జిన్నా పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నారు. లింటాస్ ఇండియా పేరుతో దేశంలోనే టాప్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీని స్థాపించిన ఘనత పదమ్సిదే. అంతా ఆయనను ‘ఇండియన్ అడ్వర్టైజింగ్ బ్రాండ్ ఫాదర్’గా పిలుస్తారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కుటుంబ సభ్యుల మధ్య ఈ రోజు తుదిశ్వాస విడిచారు.
లలితాజీ సర్ఫ్, లిరిల్ గర్ల్, చెర్రీ చార్లీ షూ పాలిష్, హమారా బజాజ్ వంటి విశేష ప్రాచుర్యం పొందిన ప్రకటనలను ఆయన రూపొందించారు. దాదాపు 100 బ్రాండ్లకు జాతీయస్థాయిలో ఓ గుర్తింపును తీసుకొచ్చారు. దీంతో ముంబైలోని అడ్వర్టైజింగ్ క్లబ్ ఆయన్ను ‘అడ్వర్టైజింగ్ మెన్ ఆఫ్ ది సెంచరీ’ అనే బిరుదుతో సత్కరించింది. ఎన్నో ఐకానిక్ ఇండియన్ యాడ్ క్యాంపైన్స్ వెనుక ఆయన ఉన్నారనడంలో సందేహం లేదు.
అలాగే సంగీత్ నాటక్ అకాడమీ నుంచి 2012లో టాగూర్ రత్న అందుకున్నారు. 1928లో గుజరాత్లోని ఖోజా ముస్లిం కుటుంబంలో ఆయన జన్మించారు. కాగా, ఆల్కే మృతి పట్ల రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆల్కే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.