తమిళనాడులో గత కొన్ని రోజులుగా ‘గజ’తుఫాన్ అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తుఫాన్ కారణంగా 45 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 80 వేల కుటుంబాలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాయి. గజ తుఫాన్ కారణంగా సర్వం కోల్పోయిన వారిని కోలీవుడ్ ఇండస్ట్రీ ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు భారీ ఎత్తున విరాళాలు అందించిన విషయం తెలిసిందే. ఇక తమిళ నటుడు విశాల్ ప్రజా సేవలో ఎల్లపుడూ ముందుంటారు. అది రైతుల సమస్య అయినా సరే… మరే సమస్య అయినా ముందుకు వచ్చి సేవ చేస్తారు.
ఈ నేపథ్యంలో మరోమారు పెద్దమనసు చాటుకున్నారు. తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి అధ్యక్షుడిగా, నడిగర్ సంఘానికి కార్యదర్శిగా ఉన్న విశాల్ గజ తుఫాన్ వలన దెబ్బతిన్న గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. విషయం తెలిసిన అతడి అభిమానులు విశాల్ను అభినందనల్లో ముంచెత్తుతున్నారు. ఇటీవల సంభవించిన గజ తుపానుకు తంజావూరు జిల్లాలోని కరగవాయల్ గ్రామం పూర్తిగా దెబ్బతింది. తంజావూరు జిల్లా పట్టు కోట్టై నియోజకవర్గంలోని కార్కావయల్ అనే గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు విశాల్.
ఆ గ్రామంలో తుఫాను కారణంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరించడమే కాకుండా, శాశ్వత గ్రామాభివృద్ధికి, ఇండియాలోని ఆదర్శ గ్రామాల్లో ఒకటి తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని విశాల్ చెప్పారు. ఆ మద్య సీనియర్ నటుడు శివకుమార్, సూర్య, కార్తీ, జ్యోతిక వారి సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్ తరుపున మొత్తం 50 లక్షల రూపాయలను ఎన్జీవోల ద్వారా తుఫాన్ బాధితులకు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.
కరగవాయల్ గ్రామం తాను దత్తత తీసుకున్నట్లు ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పటికే గజ తుఫాన్ బాధితులకు సూపర్ స్టార్ రజనీకాంత్, కమలహాసన్, విజయ్ తదితరులు అండగా నిలిచారు. ఆర్థిక సాయంతోపాటు బాధితులకు అవసరమైన వస్తువులను పంపారు.