స్టార్ డైరెక్టర్ శంకర్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో 2.0 సినిమా వచ్చింది. ఈ సినిమాలో పక్షిరాజు గా నటించిన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కి ఎంతో మంచి పేరు వచ్చింది. ప్రతినాయకుడి పాత్రలో నటించిన అక్షయ్ కుమార్ తాజాగా తన మామ బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాకు ధన్యవాదాలు తెలిపాడు. ఒకప్పుడు బాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రాజేష్ ఖన్నా సూపర్ స్టార్ గా వెలిగిపోయారు. అమితాబచ్చన్ కన్నా ముందు నుంచే ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి సూపర్ స్టార్ గా చెలామణి అయ్యారు.
భారతీయ సినీ రంగంలో తొలి సూపర్స్టార్గా గుర్తింపు పొందిన నటుడు రాజేశ్ఖన్నా జయంతి నేడు. సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన క్యాన్సర్ బారిన పడి 2012లో కన్నుమూశారు. తన సహ నటి డింపుల్ కపాడియాను పెళ్లాడిన రాజేశ్ ఖన్నాకు ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బాలీవుడ్ లో రాజేష్ ఖన్నా కూతురు ట్వింకిల్ ఖన్నా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు లో వెంకటేష్ నటించిన శీను సినిమాలో కూడా నటించింది. ట్వింకిల్ ఖన్నా హీరో అక్షయ్కుమార్ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
నేడు రాజేష్ ఖన్నా, ట్వింకిల్ ఖన్నా ఇద్దరు పుట్టిన రోజు. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ ‘నా చిన్న నాటి నుంచి మీ సూపర్స్టార్డమ్ గురించి చెప్పుకొనే కథలు వింటూ పెరిగాను. అలాంటి వ్యక్తి ముద్దుల కూతురిని పెళ్లి చేసుకుంటానని కళలో కూడా ఊహించలేదు. ఇంత గొప్ప కానుక ఇచ్చినందుకు ఆయనకు రుణపడి ఉంటాను... మీ ఇద్దరికీ జన్మదిన శుభాకాంక్షలు’ తన మామగారైన సూపర్స్టార్ రాజేశ్ ఖన్నా, తన భార్య ట్వంకిల్ ఖన్నాకు విషెస్ తెలియజేశారు.ప్రస్తుతం ట్వింకిల్ ఖన్నా రచయిత్రిగా, నిర్మాతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.