టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతున్న అందాల భామ కాజల్ ఇప్పుడు యంగ్ హీరోలతో పోటీ పడుతూ పలు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. సీనియర్, జూనియర్ హీరోలు అనే తేడా లేకుండా ఎడా పెడా సినిమాలు చేస్తూ వస్తుంది. ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ తో కవచం సినిమాలో నటించింది. తేజ దర్శకత్వంలో మరోసారి బెల్లంకొండ అబ్బాయితో రోమాన్స్ చేయబోతుంది. ఇక మెగా ఫ్యామిలీలో వరుణ్, సాయిధరమ్ తేజ్ తో తప్ప అందరు హీరోలతో నటించింది.
ఆ మద్య బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చిన కాజల్ ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటిస్తుంది. తాజాగా ఈ అందాల భామ కాజల్ కి విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ లో చేదు అనుభవం ఎదురైంది. ముంబై ఎయిర్ పోర్టుకు 75 నిమిషాల ముందుగానే తాము చేరుకున్నప్పటికీ కౌంటర్ స్టాఫ్ అయిన మోయిన్ అనే వ్యక్తి తమ సమయాన్ని వృథా చేశాడని ఆరోపించింది.
తర్వాత ఇంటర్నేషనల్ టెర్మినల్ నుంచి డొమెస్టిక్ టెర్నినల్ వద్దకు విమానాన్ని తీసుకువచ్చి... మరో 30 నిమిషాల పాటు పార్క్ చేశారని మండిపడింది. అంతే కాదు గంటసేపు డోర్లను కూడా మూసి ఉంచారని మండిపడింది. ఎయిర్ వేస్ సిబ్బంది తీరుతో తామంతా ఎంతో ఇబ్బంది పడ్డామని తెలిపింది. మొత్తానికి ప్రయాణికుల పట్ల చాలా దారుణంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో కూడా జెట్ ఎయిర్ వేస్ పై పలువురు సెలబ్రెటీలు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.