ఆ మద్య నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జనసేన అధ్యక్షులు, నటుడు పవన్ కళ్యాన్ ఎవరో తెలియదు అన్న విషయంపై ఎంతో వివాదం నడిచింది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి మెగా బ్రదర్ నాగబాబు నటుడు బాలకృష్ణపై విమర్శలు గుప్పిస్తూ వరుసగా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నేడు తిరుపతి పీజేఆర్ మూవీ ల్యాండ్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 100కు పైగా థియేటర్లలో ఎన్టీఆర్ విగ్రహాలు పెడుతున్నామన్నారు. సీఎంగా మొదటిసారి జనవరి 9న ఎన్టీఆర్ ప్రమాణస్వీకారం చేశారని, అదే రోజు ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని యాధృచ్చికంగానే విడుదల చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ చిత్ర బృందంతో పాటు బాలకృష్ణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన బయటకు వచ్చిన వెంటనే మీడియా ప్రతినిధులు బాలయ్యను నాగబాబు వివాదం గురించి నేరుగా అడిగేశారు.
దీంతో ఒక్కసారిగా నవ్వేసిన బాలకృష్ణ..‘ఇప్పుడు సమయం కాదు’ అని వ్యాఖ్యానించారు. కుమారుడు, తండ్రి పాత్ర చేయడం ప్రపంచంలోనే రికార్డు అన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా అమ్మరుణం కొంతమేర తీర్చుకున్నానని చెప్పారు. ఎన్టీఆర్లో చాలామందికి కనిపించని ఎన్నో కోణాలు ఈ సినిమాలో ఉన్నాయన్నారు. అనంతరం నటి విద్యాబాలన్, హీరో కల్యాణ్ రామ్ తో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, ఇప్పటికే ఐదు వీడియోలు విడుదల చేసిన నాగబాబు, మరో వీడియోను కూడా విడుదల చేస్తానని ఈరోజు ప్రకటించిన సంగతి తెలిసిందే.