టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో మంచి పాపులారిటీ సంపాదించిన హీరోయిన్లు అతి కొద్దిమందే ఉన్నారు. అలాంటి వారిలో నటి రిచా గంగోపాధ్యాయ ఒకరు. రానా హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లీడర్’సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయిన రిచా గంగోపాధ్యాయ తర్వాత ‘మిరపకాయ్’,‘మిర్చి’, ‘నాగవల్లి’ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించింది. హీరోయిన్ గా మంచి ఫామ్ లోకి వచ్చిన రిచా అనూహ్యంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది.
తన పై చదువుల కోసం విదేశాలకు వెళ్లిపోయింది. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ.. రెండేళ్లుగా తను ప్రేమిస్తున్న జోయ్ అనే వ్యక్తితో నిశ్చితార్ధం జరిగినట్టు రిచా గంగోపాధ్యాయ ప్రకటించింది. తాను చదువుకున్న బిజినెస్ స్కూలులో రెండేళ్ల క్రితం జోయ్ తో తనకు పరిచయం ఏర్పడిందని రిచా పేర్కొంది. అయితే పెళ్లి తేదీ మాత్రం ఇంకా తెలపలేదు. తాము గత కొంత కాలంగా ఒకరినొకరం చాలా ఇష్టపడుతున్నామని..పెద్దలనొప్పించి వివాహం చేసుకోబోతున్నామని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో తన నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోను పోస్ట్ చేసింది.
హీరోయిన్గా కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే నటనకు స్వస్తి చెప్పి ఉన్నత చదువులకై విదేశాలకు వెళ్లిపోయిన రిచా ఆ మద్య మళ్లీ వెండితెరపై మెరవబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ విషయంపై స్పందించిన రిచా తాను సినిమాల్లోకి రావడం లేదని..ఎవరో అత్యుత్సాహంతో అలాంటి వార్తలు వేస్తున్నారని కొట్టిపడేసింది. రిచా గంగోపాధ్యాయ.. నాగార్జున హీరోగా నటించిన ‘భాయ్’ తర్వాత నటనకు గుడ్ బై చెప్పింది.