టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ యంగ్ కపుల్స్ నాగ చైతన్య, సమంత తాజాగా నటిస్తున్న సినిమా ‘మజిలి’. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఏం మాయ చేసావే సినిమాతో ఈ జంట లవ్ లో పడిపోయారు. మనం సినిమా తర్వాత తమ పెద్దలకు ఈ విషయం తెలిపి రెండు సాంప్రదాయల ప్రకారం ఒక్కటయ్యారు. వివాహం జరిగిన మూడు నెలల తర్వాత సినిమా షూటింగ్ బిజీలో పడిపోయారు చైతూ,సమంత. వివాహం అనంతరం సమంత నటించిన రంగస్థలం, మహానటి, అభిమన్యుడు, యూటర్న్ ఇలా వరుసగా విజయాలు తన ఖాతాలో వేసుకుంది. చైతూ నటించిన శైలజారెడ్డి, సవ్యసాచి మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి.
పెళ్లైన తర్వాత ఈ జంట మొదటి సారిగా ‘మజిలీ’సినిమాల నటిస్తున్నారు. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా గురించి మాట్లాడుతూ..జీవిత గమనంలో ఎన్నో మజిలీలుంటాయి. ప్రతి మజిలీ ఏవో కొన్ని జ్ఞాపకాల్ని మిగుల్చుతుంది. ఇక ప్రేమ ప్రయాణం ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైనది. విరహ వేదనలు, సంయోగవియోగాలు, ఎడబాటు తెచ్చే మనోవేదన, ఏదో తెలియని సంఘర్షణ..వెరసి బాధలోనూ మాధుర్యాన్ని పంచుతుంది ప్రణయ ప్రయాణం. అలాంటి మధురమైన అనుభవాలకు వెండితెర దృశ్యరూపమే మా మజిలీ అన్నారు.
ఈ సినిమా షైన్స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్పెద్ది నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న ప్రేక్షకులముందుకురానుంది. దివ్యాంశ కౌశిక్ మరో కథానాయికగా నటిస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ లుక్ను సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. క్రికెట్ బ్యాట్ పట్టుకొని ప్రేయసి సమక్షంలో ఆనందభరితుడై ఉన్న నాగచైతన్య లుక్ అందరిని ఆకట్టుకుంటున్నది. ఇప్పటికే ఎనభైశాతం చిత్రీకరణ పూర్తయిందని నిర్మాతలు తెలిపారు రావు రమేష్, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: విష్ణు శర్మ, ఆర్ట్: సాహి సురేష్, సంగీతం: గోపీ సుందర్, రచన-దర్శకత్వం: శివ నిర్వాణ.