టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘వినయ విధేయ రామ’. ఈ సినిమా గత యేడాది షూటింగ్ మొదలు పెట్టి చాలా సీక్రెట్ గా కొంత కాలం వరకు ఏ అప్ డేట్ లేకుండా చాలా జాగ్రత్త పడ్డారు. దాంతో మెగా అభిమానులు నిరుత్సాహం పడటంతో ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేసి మంచి అంచనాలు క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఒక్కో పోస్టర్ రిలీజ్ చేస్తూ..వచ్చారు. ఇక వినయవిధేయ రామ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఈ సినిమాలో రాంచరణ్ ఎంతో పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటించబోతున్నారని అభిమానులు తెగ సంతోష పడ్డారు.
సంక్రాంతి కానుకగాఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో మిశ్రమ స్పందన వచ్చింది. అయితే బోయపాటి, రాంచరణ్ ఇమేజ్ తో ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకు వెళ్లింది. పండుగ సెలవులు కావడంతో ఈ సినిమా కూడా మంచి వసూళ్లనే రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో తొలివారంలో ఈ సినిమా 50 కోట్ల షేర్ ను సాధించింది. ఒక్క నైజాంలోనే ఈ సినిమా తొలివారంలో 12 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది.
ఈ సినిమా మొదట ఫ్యామిలీ ఎంట్రటైన్ మెంట్ గా చెబుతూ వచ్చినా..సినిమా రిలీజ్ అయిన తర్వాత అంచనాలు తారుమారు అయ్యాయి. ఈ సినిమాలో యాక్షన్ పాళ్లు ఎక్కువైపోవడం ప్రేక్షకులు పెదవి విరిచేలా చేసింది. ఇదే సమయంలో బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు, వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 2 మూవీలు కూడా రిలీజ్ అయ్యాయి. దాంతో వీక్ ఎండ్ లో వసూళ్లపై ప్రభావం పడినట్లు సినీ వర్గాలు చెప్పుకుంటున్నారు.