తెలుగు, హిందీ ఇండస్ట్రీలో 90వ దశకంలో విలన్ గా నటించిన మహేష్ ఆనంద్ అత్యంత దయనీయ స్థితిలో తన అపార్ట్ మెంట్ లో మరణించిన విషయం తెలిసిందే. ఆత్మహత్య చేసుకొన్నాడా? లేదా అనారోగ్య పరిస్థితుల్లో మరణించాడా? అనే కోణంలో ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహేష్ ఆనంద్ మరణం నేపథ్యంలో చాలా విషాదకరమైన, ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహేష్ ఆనంద్ బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, సన్నీడియోల్, సంజయ్ దత్, గోవిందా లాంటి అగ్రహీరోలతో నటించారు.
తెలుగులో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో సూపర్స్టార్ కృష్ణ నటించిన నంబర్ వన్ సినిమాలో నటించారు. అమితాబ్తో షహెన్షా, సంజయ్ దత్తో గుమ్రా, గోవిందాతో ఖుద్దార్, రంగీలా రాజా లాంటి చిత్రాల్లో నటించారు. ఒకప్పుడు ఎంతో ఆనందమయమైన ఆయన జీవితం తర్వాత విషాదాలతో నడిచింది. మహేష్ ఆనంద్ దాంపత్య జీవితంలో కూడా అనేక ఇబ్బందులు చోటుచేసుకొన్నాయి. ఆనంద్ను వదిలేసి భార్య మాస్కోకు వెళ్లిపోయారు. వెండితెర మీద గొప్ప విలనిజాన్ని పండించిన మహేష్ ఆనంద్ గత 18 ఏళ్లుగా మేకప్ వేసుకోకుండా ఉన్నారు. దాంతో తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయాడు.
కష్టాల ఓ వైపు వెంటాడుతుంటే మరోవైపు మద్యానికి బానిసయ్యాడు అని సన్నిహితులు పేర్కొంటున్నారు. మహేశ్ ఆనంద్ మృతదేహం, పలువురు సెలబ్రిటీలను, అభిమానులను కదిలించి వేయగా, ఆయన మరణించే ముందు తన ఫేస్ బుక్ ఖాతాలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ తన కుమారుడి త్రిశూల్ ఆనంద్ కోసం పెట్టారు.
"త్రిసూల్... గాడ్ బ్లెస్ యూ మై సన్. నేను మరణించే ముందు కనీసం ఒక్కసారి వచ్చి దగ్గరికి తీసుకో. జీవితాంతం నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను" అంటూ పోస్ట్ చేశారు. ఇదే మెసేజ్ ఇచ్చేలా ఉన్న ఓ పాటను కూడా షేర్ చేశారు. చనిపోయే ముందు ఆయన ఎంత ఆవేదన చెందారో ఈ పోస్ట్ ద్వారా తెలుస్తుంది. కాగా, మహేశ్ ఆనంద్, ఆయన రెండో భార్య ఎరికా డిసౌజా దంపతులకు త్రిసూల్ జన్మించాడు. త్రిసూల్ చాలా కాలంగా తన తండ్రిని కలవలేదు.