టాలీవుడ్ లో కళాతపస్వి గా చిరపరిచితమైన పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్ గొప్ప తెలుగు సినిమా దర్శకుడు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి, కె.విశ్వనాథ్. 2016లో ఆయన సినిమారంగంలో చేసిన కృషికిగాను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నాడు. ఎన్నో అద్భుతమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులని గెలుచుకున్న కళాతపస్వి కె.విశ్వనాథ్ జీవితం ఆధారంగా విశ్వదర్శనం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చెన్నై లోని ఒక స్టూడియోలో సాంకేతిక నిపుణుడి (సౌండ్ రికార్డిస్టు) గా సినిమా జీవితాన్ని మొదలుపెట్టాడు.
అన్నపూర్ణ సంస్థ నిర్మించిన తోడికోడళ్ళు అనే సినిమాకు పనిచేస్తున్నపుడు ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తో పరిచయం ఏర్పడి ఆయన వద్ద సహాయకుడిగా చేరాడు. విశ్వనాథ్ చలనచిత్ర జీవితంలో కలికితురాయి వంటిది శంకరాభరణం. జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా, తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక మైలురాయి వంటిది. భారతీయ సాంప్రదాయ కళలకు పట్టం కడుతూ ఆయన మరిన్ని సినిమాలు తీసారు. వాటిలో కొన్ని సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం మొదలైనవి.
కుల వ్యవస్థ, వరకట్నం వంటి సామాజిక అంశాలను కూడా తీసుకుని విశ్వనాథ్ చిత్రాలు నిర్మించారు. సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి సినిమాలు ఈ కోవలోకి వస్తాయి. సంగీతం,సాహిత్యం, నృత్యం ఆయన కథల్లో కలిసిపోయి కనిపిస్తాయి. మనసు తెరపై అందమైన అనుభూతులను ఆవిష్కరిస్తాయి. అలాంటి కళాతపస్వీ జీవితచరిత్రను 'విశ్వదర్శనం' పేరుతో దర్శకుడు జనార్దన మహర్షి తెరపైకి తీసుకొస్తున్నాడు.
ఈ రోజున విశ్వనాథ్ పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. విశ్వనాథ్ గురించి పలువురు సినీ ప్రముఖుల మనసులోని మాటగా ఈ టీజర్ ను వదిలారు. ఇందులో ఆ మహానుభావుడు గొప్పతనాన్ని తెలియజేస్తూ పలువురు ప్రముఖులు మాట్లాడారు. విశ్వనాథ్ తెరకెక్కించిన ఆణిముత్యాల్లాంటి సినిమాలు చేసిన నభూతో నభవిష్యత్ అన్నచందాన ఉన్నాయని అన్నారు. విశ్వదర్శనం అందరూ ప్రశంసించే మంచి చిత్రమవుతుందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత వివేక్ కూఛిబొట్ల తెలిపారు