టాలీవుడ్ లో 90వ దశకంలో స్టార్ హీరోల సరసన నటించిన నటి విజయశాంతి..తర్వాత లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో ఎక్కువగా నటించింది. టాలీవుడ్ లో ఆమెను లేడీ అమితాబ్ అని పిలుస్తారు. ఈ తరహా సినిమాల్లో నటించిన తర్వాత కమర్షియల్ సినిమాతకు దూరమైంది విజయశాంతి. ఇక లాభం లేదని రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. మొదట బీజేపీలో చేరిన ఆమె తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన సమయంలో తెలంగాణ తల్లి పార్టీ స్థాపించింది. ఆ పార్టీ కాస్త టీఆర్ఎస్ లో విలీనం చేసి కేసీఆర్ తో తెలంగాణ పోరులో పోరాడింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ తో విభేదాలు రావడంతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యింది. ప్రస్తుతం రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్న విజయశాంతి ఆ మద్య తిరిగి సినిమాల్లో నటిస్తుందని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు 25వ సినిమాగా 'మహర్షి' ముగింపు దశకి చేరుకుంది. మహేష్ బాబు తన 26వ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు. దీనికి సంబంధించిన అన్ని పనులు చక చకా పూర్తి అవుతున్నాయి.
ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్రను ఓ కీలక పాత్రలో తీసుకునేందుకు సిద్దమైనప్పటికీ..ఆయనకు తీరిక లేదని చెప్పినట్లు సమాచారం. మరో ముఖ్యమైన పాత్ర కోసం విజయశాంతి అయితే బాగుంటుందని భావించిన అనిల్ రావిపూడి ఆమెను సంప్రదించినట్టుగా సమాచారం. తన సినిమా ద్వారా విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వాలనే పట్టుదలతో ఆయన వున్నట్టుగా చెబుతున్నారు. అయితే ఈ విషయంపై విజయశాంతి ఏమన్నారు అన్న విషయం ఇంకా స్పష్టం కాలేదు. మరి మహేష్ బాబు సినిమాకు విజయశాంతి గ్నీన్ సిగ్నల్ ఇస్తుందా..వెండితెరపై ఆమె రీ ఎంట్రీ ఇస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.