భారత దేశంలో ఎన్నికలు సమీపీస్తున్న కొద్ది సినీ గ్లామర్ ఉపయోగించుకోవడానికి అధినేతలు సమాయత్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో సినీ తారలు ముఖ్య పార్టీల తీర్థం పుచ్చుకుంటున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఈ జోరు బాగానే కొనసాగుతుంది. ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి దేశ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తమ పార్టీ తరుపున ప్రచారం చేస్తే ఓటర్లు ప్రభావితమయ్యే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు ముఖ్య నేతలు.
ఇక కాంగ్రెస్ పార్టీ టిక్కెట్పై మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి సల్మాన్ ఖాన్ బరిలో నిలవనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతే కాదు సల్మాన్ ఖాన్ ని ప్రచారంలోకి దింపాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ యోచిస్తోందని వార్తలు వచ్చాయి. 1989 నుంచి ఇక్కడ బీజేపీనే గెలుస్తోంది. దీంతో ఇక్కడి నుంచి సల్మాన్ ఖాన్ను బరిలోకి దించే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. బాలీవుడ్ హీరోతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఈ అంశంపై చర్చలు జరుపుతున్నట్లు కథనాలు వెలువడ్డాయి.
అంతే కాదు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది..సల్మాన్ ఖాన్తో కాంగ్రెస్ నేతలు టచ్లో ఉన్నారని, ఇండోర్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసే అవకాశం ఉందని చెప్పారు. తాజాగా ఈ వార్తలపై సల్మాన్ ఖాన్ స్పందించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, ఏ పార్టీ తరఫునా ప్రచారం కూడా చేయనని స్పష్టం చేశాడు. ప్రభుత్వ ఏర్పాటులో అందరూ భాగస్వాములు కావాలని...అర్హత ఉన్న ప్రతొక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సల్మాన్ ట్విట్టర్ వేదిక ద్వారా పిలుపునిచ్చారు.