చిన్నికృష్ణ పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నేను కానీ నోరు తెరిస్తే పవన్ నవ రంధ్రాలు మూసుకుంటాడని చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం రేపాయి. అయితే చిన్నికృష్ణ ఇంకా తన మాటల దాడిని ఆపలేదు. పవన్ మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాడు చిన్నికృష్ణ. పనిలో పనిగా చిరంజీవిని సైతం చిన్నికృష్ణ విమర్శించాడు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ వైపు మళ్లిన చిన్నికృష్ణ.. మే 23న జగన్ చారిత్రక విజయం సాధించబోతున్నాడని.. అది చూసి ఆయన ప్రత్యర్థులందరి గుండెలు పగిలిపోతాయని చిన్నికృష్ణ అన్నాడు.
ఇటీవల భీమవరం ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ తెలంగాణ విషయంలో చేసిన వ్యాఖ్యల్ని చిన్నికృష్ణ తప్పుబట్టాడు. 70 ఏళ్లుగా తెలంగాణలో ఎన్నో రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసుంటున్నారని.. వారి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నాడు. ఇన్నేళ్లలో తన కులం ఏంటో ఎవరికీ చెప్పాల్సి అవసరం రాలేదన్న చిన్ని కృష్ణ.. తాను కూడా కాపునే అని చెప్పాడు. కాపు కులస్థులకు మెగా ఫ్యామిలీ ఒక్కటే రిప్రజెంటేషన్ కాదు.. కాపులు అంటే రంగా, ముద్రగడ లాంటి నాయకులు ఉన్నారన్నాడు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆల్ టైం హిట్ అయిన ‘ఇంద్ర' సినిమాకు కథ అందిస్తే ఏ రోజూ కనీసం భోజనం కూడా పెట్టలేదని చిన్నికృష్ణ అన్నాడు. మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అర్జున్ను హీరోగా పరిచయం చేసేందుకు ‘గంగోత్రి' కథ తయారు చేయడం కోసం ఎన్నో అవకాశలు వదులుకున్నట్లు తెలిపాుడ. పవన్ కల్యాణ్కు సినిమాల పట్ల ఫోకస్ లేదన్న చిన్ని కృష్ణ.. ఇండస్ట్రీలో తెలుగు వారిని అతి తక్కువ గౌరవించే వ్యక్తి పవన్ అని విమర్శించాడు.