లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన సినిమా విడుదలకు ముందు ఆసక్తిని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రకరకాల రూపంలో ప్రమోషన్ కార్యక్రమాలను చేస్తున్న వర్మ తాజాగా ఇంకో ట్విస్ట్ ఇచ్చారు. తన శ్రీ విద్యానికేతన్ కాలేజీకి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు త్వరగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ మోహన్బాబు ధర్నా చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ ఇటు మోహన్బాబుకు అటు ఏపీ సర్కారుకు మధ్య మాటల యుద్ధంలా మారింది. అయితే, ఈ ఎపిసోడ్లోకి వర్మ ఎంట్రీ ఇచ్చారు.
వర్మ ఎంట్రీ అంటే అది వర్మ స్టైల్లోనే ఉంటుంది కదా?! అదే జరిగింది. మోహన్బాబుతో వర్మ సమావేశమయ్యారు. ఈ భేటీ యొక్క ఫొటోలను ట్విట్టర్లో వర్మ పోస్ట్ చేశారు. ఇక్కడితోనే ఆగిపోలేదు. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇలాంటివారని తాను ఎప్పుడూ అనుకోలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా చంద్రబాబు గురించి నిజాలు మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందంటూ మోహన్ బాబుతో వర్మ అన్నారు. వెన్నుపోటుదారులను లెంపకాయ కొట్టి, మోహన్బాబుకు చప్పట్లు కొడుతున్నట్టు తనకు అనిపిస్తుందని కామెంట్ చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరును ట్యాగ్ చేస్తూ త్వరలో రిలీజ్ కాబోతోందన్న విధంగా సూచించారు.
ఓ వైపు సినిమా రిలీజ్కు అడ్డంకులు తొలగిపోయిన సంతోషంలో ఉన్న వర్మ...ఈ సినిమా కేంద్రంగానే టీడీపీ నాయకులను టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిన మోహన్బాబు ఎపిసోడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతటితో ఆగకుండా...బాబు గురించి ఓ జడ్జిమెంట్ కూడా ఇచ్చేశారు. దాంట్లో తన సినిమా ప్రమోషన్ కూడా జోడించి...ఘటికుడే అనిపించుకున్నాడని పలువురు చర్చించుకుంటున్నారు.