ప్రముఖ నటుడు రాళ్లపల్లి అనారోగ్యంతో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లో కన్నుమూశారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు. అందులో ఒకరు చనిపోగా మరో కుమార్తె ప్రస్తుతం యు.ఎస్లో ఉన్నారు. ప్రస్తుతం ఈయన పార్థివ దేహం ఆసుపత్రిలోనే ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా రాళ్లపల్లి పాపులారిటీని సంపాదించుకున్నారు. ఈయన `స్త్రీ` అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి 800కి పైగా సినిమాల్లో నటించారు.
రాళ్లపల్లి పూర్తి పేరు రాళ్లపల్లి నరసింహారావు, అయితే ఇంటి పేరుతోనే నటుడిగా పాపులర్ అయ్యారు. రాళ్లపల్లి రంగస్థల నటుడిగా జీవితం ప్రారంభించారు. చిన్నతనం నుంచే ఆయన నాటకాలు వేసేవారు. రాళ్లపల్లి ఇప్పటి వరకు 800 సినిమాల్లో నటించారు. ఏ పాత్రలోనైనా రాళ్లపల్లి ఒదిగిపోయేవారు. నాటి స్టార్ హీరోలందరి చిత్రాల్లోనూ రాళ్లపల్లి నటించారు. చండశాసనుడు, తూర్పు వెళ్లే రైలు, అభిలాష, ఖైదీ, దేశోద్దారకుడు, అన్వేషణ, కలిసుందాం రా, జయం చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. రాళ్లపల్లి నటించిన చివరి సినిమా నేచురల్ స్టార్ నానీ 'భలే భలే మగాడివోయ్'.
దర్శకుడు జంధ్యాల, వంశీల ద్వారా చిత్ర పరిశ్రమకు రాళ్లపల్లి హాస్యనటుడిగా పరిచయమయ్యారు. ఈ ఇద్దరి దర్శకత్వం వహించిన దాదాపు అన్నీ సినిమాల్లో రాళ్లపల్లి నటించారు. సితార, కనకమహాలక్ష్మీ రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్, అన్వేషణ, ఏప్రిల్ 1 విడుదల, జోకర్, ఆలాపన వంటి సినిమాల్లో నటించి ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలకు వంశీ దర్శకత్వం వహించారు.