బాక్సాఫీస్ వద్ద యువ హీరోలు ఆది సాయి కుమార్ మరియు శ్రీవిష్ణులతో.. సీనియర్ హీరో రాజశేఖర్ పోటి పడబోతున్నాడు. రాజశేఖర్ ది పోటి పడే వయస్సు కాదు, పైగా పోటి పడి నెగ్గేంత ఫాలోయింగ్ లేదు. మరెందుకు రాజశేఖర్ కి ఈ పోటి అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ విషయంలోకి వెళ్తే 'గరుడ వేగ' చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాక రాజశేఖర్ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటించిన చిత్రం 'కల్కి'. జూన్ 28వ తేదీన ఈ చిత్రం విడుదలవ్వనుంది.
అయితే, ఇదే రోజు జూన్ 28న మరో రెండు సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. వాటిలో డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఆది సాయి కుమార్ హీరోగా రానున్న 'బుర్రకథ' ఒకటి కాగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా చేసిన 'బ్రోచేవారెవరురా' మరొకటి. బుర్రకథలో మాస్ కి నచ్చే అంశాలు ఉన్నాయని ఈ సినిమా పై మంచి పాజిటివ్ బజ్ ఉంది. అలాగే శ్రీవిష్ణుతో పాటు నివేత థామస్, నివేత పేతురాజ్, ప్రియదర్శి, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణలు కలిసి నటించిన 'బ్రోచేవారెవరురా' పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
మరి మంచి అంచనాలు ఉన్న చిత్రాల పై పోటీకి దిగుతున్న కల్కి నిలబడుతుందా.. అయితే ఈ సినిమా కూడా మొదటి నుండి భిన్నమైన రీతిలో ఆసక్తిని రేపుతోంది. కానీ ప్రశాంత్ - రాజశేఖర్ కాంబినేషన్ పై మాస్ ఏరియాల్లో పెద్దగా ఆసక్తి లేదు. ఇలాంటి నేపధ్యంలో యంగ్ హీరోలతో రాజశేఖర్ కి పోటీ అవసరమా ? మరి పోటీలో రాజశేఖర్ ఎలాంటి రిజల్ట్ రాబట్టుకుంటారో చూడాలి.