ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్ బాహుబలి సినిమాలో 'కట్టప్ప' పాత్ర పోషించాక ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అంతేకాకుండా దక్షిణాదిలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఆయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కుమారుడు శిబి సత్యరాజ్ సినిమాల్లో నటిస్తుండగా, కూతురు దివ్య విభిన్నంగా న్యూట్రిషియనిస్ట్‌గా పని చేస్తున్నారు. 
 
ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ త్వరలో తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం సత్యరాజ్ రాజకీయపరమైన కామెంట్స్ చేసి వార్తల్లోకి ఎక్కగా, ఇపుడు ఆయన కూతురు ఇలాంటి ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది.
 
దివ్య చెన్నైలో న్యూట్రిషియనిస్ట్‌గా సేవలు అందిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మధ్యాహ్న భోజన పథకం అయిన అక్షయపాత్రకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న దివ్య ఆరోగ్య వ్యవస్థ సరిగ్గా లేదని, అందుకోసం తగిన మార్పులు తీసుకురావాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు సమాచారం. 
 
రాష్ట్రంలో చాలా మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి రాజకీయాల్లో ఉండటం వల్లనే వ్యవస్థలో మార్పు తేవడం సాధ్యమని, అందుకోసం ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు దివ్య ప్రకటించారు. ఇప్పటికే సత్యరాజ్ ఎంకె స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె పార్టీ మద్దతుదారుగా ఉన్నారు, కనుక దివ్య కూడా ఇదే పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: