ఇండస్ట్రీలో మన రచయితలు, దర్శకులు సినిమా కథల కోసం రకరకాల సోర్స్ లు వెదుకుతుంటారన్న విషయం అందరికి తెలిసిన సంగతే. ఇదేమంత కొత్త విషయమేమి కాదు. బాపు, మణిరత్నం లాంటి గొప్పవాళ్లు కూడా పురాణాలను సోషలైజ్ చేసి కథలు అల్లారు. ఆ కథలతో హిట్ సినిమాలు తీశారు. ఇక ఈ తరం దర్శకులు కొంతమంది పాత సినిమా కథలను కాస్త అటు ఇటు చేసి, పాత్రలను అటు ఇటు మార్చి కొత్త కథలు అల్లుతున్నారు. అలా అల్లిన కథల్లో కొన్ని మాత్రమే హిట్టవుతున్నాయి. చాలా మటుకు ఫ్లాపవుతున్నాయి. ఇక ఫారిన్ సినిమాల సిడీల సంగతైతే ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఒక రూములో కుప్పలుగా ఉంటాయి. అదే పనిగా వాటిని చూసి కొత్త కథ ని రాసేస్తున్నారు మనవాళ్ళు.

అయితే నాగచైతన్య-వెంకటేష్ కాంబినేషన్ లో రాబోతున్న వెంకీమామ సినిమాకు భాగవతం పురాణంలోని ఓ పాయింట్ ఆధారం అని ఇండస్ట్రీలో కొత్తగా ఓ మాట వినిపిస్తోంది. వెంకీమామ సినిమాకు కోన వెంకట్, జనార్థన మహర్షి, డైరక్టర్ రవీంద్ర కలిసి కథ సిద్దం చేశారు. సినిమా కథ ఏమోకానీ, పాయింట్ మాత్రం పురాణంలో కంసమామ టైపు అని లేటెస్ట్ న్యూస్. అయితే కంసమామ, మేనల్లుడు కృష్ణుడి పాలిట విలన్ అన్న విషయం భాగవతం చదివిన వాళ్ళకి విన్న వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఇక్కడ వెంకీ మామ అలా కాదు. కానీ రెండింటికీ కామన్ పాయింట్, మామకు అల్లుడి వల్ల గండం వుంటుంది అన్న జ్యోతిష్యం పాయింట్ అని తెలుస్తోంది. 

మరి ఈ పాయింట్ ను ఫన్నీగా ఎలా డీల్ చేసి, వెంకీ-చైతూల మధ్య ఫన్ రాబట్టారో చూడాలి. వెంకీ మామనే కాదు, ప్రభాస్ - రాధాకృష్ణల 'జాను' (వర్కింగ్ టైటిల్)కు కూడా జ్యోతిష్యం, పామిస్ట్రీ, ఒకరివల్ల మరోకరికి గండం అనే పాయింట్ తోనే తయారవుతోందని ఇన్‌సైడ్ టాక్. ఈ లెక్కన చూస్తే జ్యోతిష్యం సినిమాల సీజన్ స్టార్ట్ అయిందన్నమాట. మరీ ఛాదస్తం కాకపోతే ఈ పాయింట్‌తో సినిమాలేంటి అని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: