2019 ప్రారంభం అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు పాపులర్ హీరోతో మాంచి మాస్ మసాలా సినిమా ఒక్కటి కూడా రాలేదు. ఎఫ్ 2ను మాస్ సినిమా అనేకన్నా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనడం కరెక్ట్. అలాగే మహర్షి, మజిలీ కూడా ఫ్యామిలీ సినిమాలే. పక్కా యూత్ ఫుల్ మాస్ సినిమాలు ఇప్పటివరకు రాలేదని అర్థమవుతోంది. ఇక ప్రస్తుతం బాక్సాఫీస్ బాగా డల్ గా వుంది. సినిమాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. పబ్లిసిటీ హడావుడి తప్ప, థియేటర్లకు కళ తెచ్చిన సినిమాలు కనిపించడం లేదు. ఇలాంటి టైమ్ లో రామ్ 'ఇస్మార్ట్ శంకర్', విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' వస్తున్నాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాల మీదే వుంది ఇండస్ట్రీ దృష్టి అంతా. పూరి జగన్నాథ్ కు మాస్ పల్స్ బాగా తెలుసు. కానీ ఆయన ఈ మధ్య కాలంలో సరైన సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేదు.

అందుకే పూరి జగన్నాథ్ ఇది తనకు చివరి అవకాశం అని అనుకుంటూ, తీసిన సినిమా ఇస్మార్ట్ శంకర్. క్రేజ్ అయితే బాగానే క్రియేట్ అయింది. మాస్ దాహం ఫుల్ గా తీర్చేలా వుందని అనిపిస్తోంది. ఇప్పటికే విడుదలయిన రెండు ట్రైలర్స్ చూస్తుంటే పూరి కథ, కథనాల విషయంలో కాస్త జాగ్రత్తగా వుంటే చాలు, సరైన సినిమా లేక అల్లల్లాడిపోతున్న మాస్ జనాలు  ఈ సినిమాను నెత్తిన పెట్టేసుకుంటారని అనిపిస్తోంది. ఇక విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ ఓ వారం తర్వాత అంటే 25న వస్తోంది. పక్కా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. విడుదలయిన ట్రైలర్ చూస్తుంటే, విజయ్ సినిమాల్లో అతని ఫ్యాన్స్ కోరుకునే ఎలిమెంట్స్ అన్నీ బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. 

విజయ్ సినిమా బాగుండాలే కానీ, కలెక్షన్ల విషయంలో దూసుకుపోతుంది. ఈ రెండు సినిమాలు ఆడితే, థియేటర్లు ఆగస్టు 15న సాహో వచ్చేవరకు కళకళలాడిపోతాయి. 
కానీ ఇక్కడ ఇంకో పాయింట్ వుంది. రామ్ - పూరికి ఇప్పుడు బ్లాక్ బస్టర్ పడాలి. అప్పుడే సినిమా కనీసం సూపర్ హిట్ అనిపించుకుంటుంది. విజయ్ దేవరకొండకు అలా కాదు. యావరేజ్ అనిపించుకున్నా చాలు. సూపర్ హిట్ అయిపోతుంది. అతని క్రేజ్ అలా నడుస్తోంది. చూడాలి  మరి ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఏ రెంజ్ లో ఆకట్టుకుంటాయో. 



మరింత సమాచారం తెలుసుకోండి: