ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రుపొందుతున్నచిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఇటీవలే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. వచ్చే అక్టోబర్ 2వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ తెగ కష్టపడుతుంది. కాగా ఈ సినిమా కోసం మెగా అభిమానులు మరియు మెగాస్టార్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా సినిమా అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదని.. అసలు ‘సైరా నరసింహారెడ్డి’ టీమ్ కి ఏమైంది...? అని సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరి ఇప్పటికైనా దర్శకుడు సురేందర్ రెడ్డి లేట్ చెయ్యకుండా సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్స్ ఇవ్వడం మొదలు పెడితే.. మెగా అభిమానులు సినిమాను మరింతగా జనంలోకి తీసుకువెళ్తారు. ముందుగా సైరా టీమ్ భారీ ఎత్తున గొప్ప ప్రచార ప్రణాళికలను రూపొందించాలి. అలాగే ట్రైలర్ ను గ్రాండ్ గా విడుదల చేయడానికి చిత్రబృందం ప్రణాళికలను సిద్ధం చేసుకుని డేట్ ను అనౌన్స్ చెయ్యాలి. ఈ చిత్రం ట్రైలర్ కోసం అభిమానాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎప్పటినుంచో రిలీజ్ చెయ్యటానికి చూస్తోన్న ఈ సినిమా స్పెషల్ పోస్టర్ ను త్వరగా రిలీజ్ చెయ్యాలి. అమితాబ్ బచ్చన్ మరియు చిరంజీవిల కాంబినేషన్ లో వచ్చే ఈ స్పెషల్ పోస్టరే హిందీలో సైరాకి బజ్ ను డిసైడ్ చేస్తోంది.
ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇక ఇటివలే తన పాత్రకు డబ్బింగ్ పార్ట్ ను మెగాస్టార్ పూర్తి చేశారు. మొత్తానికి ఆగష్టు మూడో వారం కల్లా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్ని పూర్తవుతాయట. ఇక చిత్రాన్ని అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగానే విడుదల చేస్తుండటానికి కారణం.. సినిమా అక్టోబర్ 2న రిలీజ్ చేస్తే.. రెండో వారం నుండి దసరా సెలవులు కూడా తమ సినిమాకు కలిసొస్తాయని చిత్రబృందం ఆలోచిస్తోంది. అందుకే అక్టోబర్ 2ను ఫైనల్ చేసింది.