మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమాను దర్శకుడు కొరటాల శివతో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించిన కొరటాల శివ.. చిరంజీవితో సినిమా చేస్తున్నారనగానే అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ చిత్రం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న లాంఛనంగా ప్రారంభమవుతుందని సినీ వర్గాల ద్వారా తెలిసింది. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథి పాత్రలో నటించనున్నారట. 


ఇది ఒక మంచి సందేశంతో కూడి కమర్షియల్ సినిమా అట. దీనిలో ఒక ముఖ్యమైన అతిథి పాత్ర ఉందట. ఈ పాత్రను రామ్ చరణ్‌తో చేయిస్తే బాగుంటుందని దర్శకుడు కొరటాల భావించారట. దీనికి రామ్ చరణ్ కూడా అంగీకారం తెలిపారని టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. గతంలో ‘మగధీర, బ్రూస్ లీ, ఖైదీ నెం.150’ సినిమాల్లో తండ్రీకొడుకులిద్దరూ కలిసి నటించారు. కాగా, ప్రస్తుతం దర్శకుడు హీరోయిన్ వేటలో ఉన్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార లేదంటే శృతిహాసన్ నటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ, కొరటాల మాత్రం ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకురావాలని చూస్తున్నారట. ఆ విధంగా ప్రయత్నాలు కూడా మొదులుపెట్టారని అంటున్నారు. 


ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సినిమా కోసం చిరంజీవి బరువు తగ్గనున్నారట. దీనికోసం ఆయన విశాఖపట్నం వెళ్తున్నారని సినీ వర్గాల సమాచారం. అక్కడ ఫిట్‌నెస్‌కి సంబంధించిన కసరత్తులు చేస్తారట. ఇక, చిరంజీవి 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. రాయలసీమకు చెందిన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: