అటు నటుడిగా, ఇటు రచయితగా రెండు విధాలుగా టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న అడివి శేష్, ప్రస్తుతం నటిస్తున్న కొత్త సినిమా ఎవరు. కొత్త దర్శకుడు వెంకట్ రాంజీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పివిపి సంస్థ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మాతలుగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా టీజర్ మరియు ఒక సాంగ్ ఇప్పటికే యూట్యూబ్ లో విడుదలై వీక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టిన విషయం తెలిసిందే. 

ఇక ఈ సినిమా చిత్రీకరణ విషయంలోనూ, యూనిట్ సభ్యుల్లోని కొందరికి తెలియకుండా రహస్యంగా సీన్స్ చిత్రీకరించినట్లు ఇటీవల నటుడు అడివి శేష్ ఒక ట్వీట్ ద్వారా తెలిపారు. ఇక రేపు ఈ సినిమా అధికారిక ట్రైలర్ విషయమై ఒక బడా సర్ప్రైజ్ రాబోతోందని, అంటే తమ సినిమా ట్రైలర్ ను ఒక సర్ప్రైజింగ్ పర్సన్ విడుదల చేస్తారని శేష్ నేడు తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించారు. తమ సినిమాలోనే కాదు, సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా ఎన్నో ట్విస్టులు ఉన్నాయి, ఎదురుచూడండి అంటూ తన ట్వీట్ లో తెల్పడం జరిగింది. ఇప్పటివరకు తెలుగు సినిమా తెరపై వచ్చిన థ్రిల్లర్ మూవీస్ జానర్ లోనే ఈ సినిమా సాగినప్పటికీ, 

ఇందులో వచ్చే ట్విస్టులు దాదాపుగా ప్రేక్షకుడి ఊహకు అందవని, ఆ విధంగా స్క్రిప్ట్ ను తాము ఎంతో పకడ్బందీగా రూపొందించామని శేష్ అంటున్నారు. ఇక సినిమాను తొలుత ఈనెల 23న విడుదల చేయాలని యూనిట్ సభ్యులు భావించారు. కానీ, ప్రభాస్ నటిస్తున్న భారీ మూవీ సాహో అర్ధాంతరంగా ఒక 15 రోజుల వాయిదా పడి 30వ తేదికి వాయిదా పడడంతో, ఎవరు సినిమా యూనిట్ వెంటనే తమ సినిమాను 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రోజురోజుకు ప్రేక్షకుల్లో అంచనాలను మరింతగా పెంచుకుంటూ పోతున్న ఈ సినిమా, రేపు విడుదల తరువాత ఎంతటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే, ఈనెల 15 వరకు వేచి చూడాల్సిందే.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: