తెలుగుదేశం పార్టీ బలం ఎక్కడ ఉంది. ఆ పార్టీ నలభయ్యేళ్ళ పాటు మనుగడ సాగించిందంటే దానికి కారణం ఏమిటి. సినిమా నటుడు పెట్టిన పార్టీ పునాదుల వరకూ పాతుకుపోవడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి. ఎటువంటి పొలిటికల్ గ్లామర్ లేకుండా అన్న గారు చనిపోయినా కూడా టీడీపీ పాతికేళ్ళకు పైగా బతికు ఉండడానికి కారణమేంటి. దీనికి సమాధానాలు సింపుల్ గా కనిపిస్తున్నా చాలా లోతు అయినవి.
ఇదే ఇపుడు వైసీపీ రిసెర్చ్ చేస్తోంది. అధినాయకుడి గ్లామర్ అన్నది ఒక్కసారి, మహా అయితే రెండు మూడు సార్లు పనిచేస్తుంది. అదే పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ వరకూ తీసుకుపోగలిగితే ఆ పార్టీ పది కాలాలా పాటు చల్లగా ఉంటుంది. టీడీపీ విషయంలో ఇదే జరిగింది. ఆవేశంతో అన్న నందమూరి పెట్టిన పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ దాకా తీసుకెళ్ళింది మాత్రం చంద్రబాబు. క్యాడర్ బేస్డ్ పార్టీగా టీడీపీని ఆయన తీర్చిదిద్దారు. అందువల్లనే టీడీపీ జయాపజయాలకు అతీతంగా ఇన్నాళ్ళు రాణించింది.
అందువల్ల టీడీపీని చూసి వైసీపీ తన పార్టీని స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటోందట. జగన్ గ్లామర్ కు తిరుగులేదు. ఈ టైంలోనే పార్టీని అట్టడుగు వరకూ విస్తరింపచేసుకుంటే పార్టీకి తిరుగు ఉండదని భావిస్తున్నారు. చేతిలో అధికారం ఉంది. కాబట్టి బలమైన నాయకులను పార్టీ బలహీనంగా ఉన్న చోట చేర్చుకుని గట్టి పరచుకోవాలనుకుంటున్నారు. దాంతో ఆపరేషన్ టీడీపీ మొదలుపెట్టారని అంటున్నారు.
మాకు టీడీపీ ఎమ్మెల్యేలు వద్దు, మాజీ ఎమ్మెల్యేలు, గట్టి నాయకులు కావాలి. ఇదే ఇపుడు వైసీపీ స్ట్రాటజీ. టీడీపీలో ఉన్న బలమైన నాయకత్వంపై వైసీపీ గురి పెట్టింది. అదే సమయంలో చంద్రబాబు వ్రుధ్ధాప్యం కారణంగా పార్టీకి దశా దిశా లేదని భావిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు.
వారిని వైసీపీలోకి చేర్చే పనికి స్టార్ట్ చేసేశారు. టీడీపీకి పునాది లాంటి క్రిష్ణా జిల్లా నుంచే ఇది మొదలవుతోంది. అక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన దేవినేని అవినాష్ ఇపుడు వైసీపీలోకి చేరబోతున్నాడు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కూడా ఫ్యాన్ నీడకు రావాలనుకుంటున్నారు. ఇక విశాఖ వంటి చోట్ల కూడా టీడీపీ నేతలకు వల పన్నుతున్నారు. ఈ విషయాన్ని విజయసాయి స్పష్టంగానే చెప్పేస్తున్నారు. పార్టీలో చేరడానికి ఎంతో మంది రెడీగా ఉన్నారు, దయచేసి ఎవరూ అడ్డు చెప్పకండి, ఇది పార్టీ మేలు కోసమే అంటూ ఆయన చేసిన తాజా ప్రకటన ప్రకంపనలు పుట్టిస్తోంది.