అతనొక్కడే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన దర్శకుడు సురేందర్ రెడ్డి. కికె, ధృవ, రేసుగుర్రం లాంటి విభిన్నమైన కథాంశాలని ఎన్నుకుంటూ తనదైన దారిలో ముందుకెళ్తున్నాడు. ఆయన టేకింగ్ చాలా స్టైలిష్ గా ఉంటుందని అంటుంటారు. రేసుగుర్రం సినిమానే గమనిస్తే ఆ సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి కథేమీ ఉండదు. మొత్తం సినిమాని కథనంతో నడిపిస్తాడు. అంతేగాక తనదైన కామెడీ టైమింగ్ తో సినిమాని పరుగులు పెట్టించాడు.
రేసుగుర్రం ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. అయితే సురేందర్ రెడ్డి సైరా సినిమాని దర్శకత్వం చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. మెగాస్టార్ ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ సినిమాని ఏ రాజమౌళికో అప్పగిస్తారని అనుకున్నారు. కానీ చిరంజీవి, చరణ్ లు సురేందర్ రెడ్డిని నమ్మారు. అయితే సినిమా ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పటి వరకు రిలీజైన ప్రోమోలని మేకింగ్ వీడియోలని చూస్తుంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థం అవుతుంది.
చిరంజీవి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని సరిగ్గా నిర్వర్తించినట్లే అనిపిస్తుంది.సైరా పట్ల సురేందర్ ఎంత ఎగ్జైట్మెంట్తో ఉన్నాడంటే.. ఇకపై తాను సినిమాలు మానేసినా పర్వాలేదంటున్నాడు. ఇప్పటిదాకా తాను ఏవో సినిమాలు తీశానని.. కానీ సైరా అనుభవం వాటన్నింటికీ భిన్నమైందని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ సినిమా తీయడంతో తన జన్మ ధన్యమైందని.. ఇంత పెద్ద ప్రాజెక్టును తాను డీల్ చేస్తానని ఎన్నడూ ఊహించలేదని చెప్పాడు సురేందర్.
సైరా ఇచ్చిన సంతృప్తి, కిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని.. అందుకే ఇకపై తాను సినిమాలు మానేసినా ఏ బాధా లేదని.. జీవితాంతం చెప్పుకునే సినిమా ఇదని చెబుతూ ఉద్వేగానికి గురయ్యాడు సురేందర్. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో రూ.200 కోట్లకు పైగా బడ్జెట్లో తెరకెక్కిన సైరా అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.