కెరీర్ ప్రారంభంలో మాంచి జోరు మీదున్న సాయి ధరమ్ తేజ్ ఆ తర్వాత బాగానే ఇబ్బందులు పడ్డాడు. అయితే ఆరు డిజాస్టర్ల తర్వాత చిత్రలహరి రూపంలో కొద్దిగా ఫాం లోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా ప్రతి రోజు పండగే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని ఇంకో రెండు నెలల్లోపే షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేసేలా పక్కా ప్లానింగ్ తో సాగుతున్నట్టు సమాచారం. దీని తర్వాత దేవ కట్టా, వీరు పొట్లలతో చర్చల్లో ఉన్న తేజ్ తాజాగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో కూడా ఒక సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

అనిల్ సుంకర నిర్మాణంలో ఈ డైరెక్టర్ తో తెలుగు సినిమా చేసేందుకు తేజ్ రెడీగా ఉన్నారట. దీనికి టైం పట్టేలా ఉన్నా కథ పరంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కాని ఇక్కడే ఒక రిస్క్ ఉంది. వెంకట్ ప్రభు గొప్ప టాలెంట్ ఉన్న దర్శకుడే. కాకపోతే మన నేటివిటీకి సింక్ అయ్యేలా ఆయన సినిమాలు ఇక్కడ అంతగా మెప్పించలేకపోయాయి. అందుకు ముఖ్య కారణం వెంకట్ ప్రభు అంచుకున్న కథ, కథనాలు మన తెలుగు ప్రేక్షకులకు అంతగా రుచించకపోవడమేనని అందరికి అర్థమైన విషయమే. అయినా ఈ డైరెక్టర్ తెలుగులో సినిమా చేయాలనుకోవడం సాహసమే. అది కూడా ఈ మెగా హీరోతో.

తమిళ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన గ్యాంబ్లర్ ఇక్కడ జస్ట్ యావరేజ్ అయ్యింది. సూర్యతో తీసిన రాక్షసుడు అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కార్తి బిర్యానీ కూడా పెద్ద డిజాస్టరే. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రెండేళ్ళుగా నిర్మాణంలో ఉన్న పార్టీ సినిమాతో పాటు మానాడు సినిమా కూడా బాగా డిలేగా షూటింగ్ జరుగుతున్నాయి. ఈ రెండు సినిమాలు అయ్యాకే సాయి ధరమ్  తేజ్ తో సినిమా పట్టాలెక్కొచ్చు. అయితే వెంకట్ ప్రభుతో సినిమా అంటే స్టొరీ సెలక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఫిల్మ్ నగర్ లో గట్టిగా వినిపిస్తున్న మాట. మరి తేజు ఏమి డిసైడవుతాడో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: