బాలకృష్ణ ఎంతో ప్రతిస్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఎన్నో ఆశలతో ఆ చిత్రాన్ని నిర్మించి నటించారు కాని ఆచిత్రం ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకపోవడంతో కొంత నిరాశపడ్డారు. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తన 105వ చిత్రాన్ని చేస్తున్నారు. ఎన్నికల కారణంగా సినిమా కాస్త ఆలస్యంగా ప్రారంభం అయ్యింది. ఇటీవలే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రంను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు. ఇక బాలయ్య తన తర్వాత చిత్రం 106వ చిత్రం విషయంలో కూడా నిర్ణయం తీసుకున్నారు.
చాలా కాలం తర్వాత మరోసారి బాలకృష్ణ.. బోయపాటిల కాంబినేషన్లో ఒక చిత్రం ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆ చిత్రం గురించి ప్రధానంగా చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. కేఎస్ రవికుమార్ చిత్రం కంటే ముందే బోయపాటితో బాలయ్య సినిమా చేయాల్సి ఉన్నా కూడా అది ఆలస్యం అవుతూ వస్తుంది. వినయ విధేయ రామ చిత్రం ఫలితం నేపథ్యంలో బోయపాటికి బాలయ్య దూరంగా ఉంటున్నాడనే టాక్ కూడా వినిపించింది. వీరిద్దరి కాంబోలో మూవీ అనుమానమే అనుకుంటున్న సమయంలో సినిమాను వచ్చే నవంబర్ లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇక మరి వీరి కాంబినేషన్లో రాబోయే చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించబోతున్నారు. ఈయన గతంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక చిత్రంను నిర్మించారు. ఇటీవలే ఈ చిత్రంకు సంబంధించిన చర్చలు పూర్తి అయ్యాయి. నవంబర్ నుండి షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ లేదా దసరాకు సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో బోయపాటి ఉన్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా మరియు లెజెండ్ చిత్రాలు మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. మరోసారి వీరి కాంబోలో సూపర్ హిట్ నమోదు అయ్యేనో లేదో చూడాలి. మరి ఈ సారి ఈ కాంబినేషన్ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.