ఆగస్ట్ నెల అంటే ఎన్నో అంచనాలు ఉంటాయి. ముఖ్యంగా సినిమా చూసేవారికి తీసేవారికి కూడా ఈ నెల అతి ముఖ్యమైనది. శ్రావణ మాసం రావడం, ఆగస్ట్ 15 వంటి భారీ ఈవెంట్ ఉండడం, సెలవులు ఎక్కువగా ఉండడం, పరీక్షలు టెన్షన్ లేని నెల, వాతావరణంపరంగా కూడా పెద్దగా ఇబ్బందులు లేని మాసం. ఇలా ఆగస్ట్ బాక్సాఫీస్ గలగలలకు మంచి నెల అంటారు.
అయితే ఆగష్టు 2019 మాత్రం ఆశా నిరాశల మద్య వూగిసలాడింది. ఈ నెలలో రాక్షసుడు మూవీతో బెల్లంగొండ శ్రీనివాస్ కు ఒక హిట్ దక్కింది. చాన్నాళ్ళుగా ఆతను వేచిన ఫలితం దక్కింది. అదే విధంగా నాగార్జున నటించిన మన్మదుడు 2 బొల్తా కొట్టేసింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నాగ్ కి భారీ డిజాస్టర్ గా మిగిలింది.
ఇంకో వైపు సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన శర్వానంద్ హీరోగా వచ్చిన చిత్రం రణరంగం దారుణమైన ఫలితాన్ని తెచ్చింది. అడవి శేషు నటించిన ఎవరు చిత్రం టార్గెట్ ని రీచ్ అయి శేషు కెరీర్లో అతిపెద్ద హిట్గా నిలిచింది. ఇక సాహో కంటే ఒక వారం ముందే వచ్చిన కౌసల్య కృష్ణమూర్తి కంటెంట్ కొరత, పేలవమైన విలువలతో ఆకట్టుకోలేకపోయింది. అదే విధంగా పైన పేర్కొన్న చిత్రాలతో పాటు, డజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చాయి కానీ అవి ఎటువంటి అలికిడీ లేకుండా ఎక్కడికో ఎగిరిపోయాయి.
ఇవన్నీ పక్కన పెడితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సాహో ఆగస్టు 30 నుండి థియేటర్లలో సందడి చేయడం మొదలెట్టింది. ఈ చిత్రం యొక్క బాక్స్ ఆఫీస్ ఫేట్ ఏంటి అన్నది ఇంకా క్లారిటీ రానప్పటికీ వచ్చిన రివ్యూస్ మాత్రం నెగిటివ్ గా ఉన్నాయి. దాంతో సాహో వంటి భారీ బడ్జెట్ మూవీ బయ్యర్లకు షాకిచ్చెలా ఉందని అంటున్నారు. మొత్తానికి ఆగస్ట్ నెల మాత్రం కాసులు కురిపిస్తుదనుకుంటే బయ్యర్లకు, నిర్మాతలకు కన్నీళ్ళే కురిపించిందని అంటున్నారు.