ఈ మధ్య కాలంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలు ఎక్కువగా వస్తన్నాయి. హీరోయిన్స్ అందరూ కూడా అలాంటి చిత్రాల పైనే మక్కువ ఎక్కువ చూపుతున్నారు. అనుష్క నటించిన అరుంధతి, రాణిరుద్రమదేవి, భాగమతి అలాగే ఇప్పుడు నిశ్శబ్ధం చిత్రాలు అలాంటి కోవకు చెందినవే. అలాగే కీర్తి సురేష్ నటించిన బయోపిక్ సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహానటి. ఈ చిత్రాల తర్వాత లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు మరింత డిమాండ్ పెరిగింది. ప్రతి ఒక్క హీరోయిన్ అలాంటి చిత్రాలు చెయ్యాలని అనుకుంటున్నారు. హీరో లేకుండా సోలో పెర్ఫార్మెన్స్తో తామేంటో నిరూపించుకోవాలనుకుంటున్నారు. ఇకపోతే గతంలో ఇలాంటి చిత్రాలు ఎక్కువగా విజయశాంతి కర్తవ్యం, మాలాశ్రీ ఎక్కువగా చేసేవారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు ఆ ట్రెండ్ మొదలైంది. మరి అలాంటి ట్రెండ్నే ఫాలో అవుతా అంటుంది ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మరి ఈ పంజాబీ బ్యూటికి అలాంటి అవకాశం దొరికితే తెర పైన ఎంత వరకు మెప్పించగలదు అసలు ఎలాంటి పాత్రలకు ఈమె బావుంటుంది అన్నది తెలియాలి.
ఇన్నాళ్లూ కమర్షియల్ చిత్రాలు మాత్రమే చేస్తూ వచ్చిన కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలపై దృష్టి పెడుతోంది. కథానాయిక ప్రధానంగా సాగే చిత్రాలలో నటించాలని ఉందని చెబుతూ, అలాంటి చిత్రాలలో తన సత్తా చూపిస్తానని అంటోంది. నాకు కథానాయకికి ప్రాముఖ్యత ఉన్న చిత్రాల్లో నటించడం ఇష్టం. అలాగని అలాంటి అవకాశాలు వచ్చే వరకూ కమర్శియల్ కథా చిత్రాల్లో నటించడానికి నిరాకరించను. అదే విధంగా కథానాయకికి ప్రాధాన్యత అంటే కథ అంతా ఆ పాత్ర చుట్టూనే తిరగాలని అర్థం కాదు. నేను ఇంతకు ముందు నటించిన చిత్రాల్లో కథానాయకి పాత్రకు ప్రాముఖ్యత ఉంది. అలాంటి చిత్రాలకు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందన్న నమ్మకంతో నిర్మాతలు చిత్రాలు చేశారు.
నిర్మాతలకు లాభం వస్తేనే వారు మళ్లీ చిత్రాలు చేయగలరు. మరో విషయం ఏమిటంటే ఇప్పుడు అవార్డు కోసం నిర్మించే కథా చిత్రాలు కమర్శియల్ అంశాలతో కూడి ఉండాలని భావిస్తున్నారు. నాకు అవార్డులు పొందాలన్న కోరిక ఉంది. మరి ఎవరైనా ఛాన్స్ ఇస్తారేమో చూడాలి!