సంతోషం సినీ వారపత్రిక 17వ వార్షికోత్సవం, సంతోషం సౌత్
ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ 2019 ప్రదానోత్సవం చిత్రసీమ అతిరథ మహారథుల సమక్షంలో, వేలాది మంది ప్రేక్షకుల మధ్య అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం సాయంత్రం నిర్విరామంగా 6 గంటకు పైగా సాగిన ఈ వేడుకలో అలనాటి
తార జమున పాల్గొన్నారు.
65 సంవత్సరాల సినీ జీవితం పూర్తయిన సందర్భంగా విఖ్యాత నటి
జమున నిర్మాతలు అల్లు అరవింద్, డి. సురేశ్ బాబు చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘‘జమునగారు నటించిన తొలి సినిమా ‘పుట్టిల్లు’లో మా నాన్నగారు (అల్లు రామలింగయ్య) కూడా నటించారు. మద్రాస్లో మేముండే వీధిలోనే ఆమె కూడా ఉండేవారు. ఇప్పుడు ఆమెకు నేను అవార్డు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు.
సురేశ్బాబు మాట్లాడుతూ ‘‘మా నాన్నగారు సోలోగా నిర్మించిన మొదటి సినిమా ‘రాముడు భీముడు’లో
జమున గారు హీరోయిన్గా నటించారు. నా చిన్నతనంలో మేము, ఆమె ఒకే అపార్ట్మెంట్లో ఉండేవాళ్లం. నా చేతుల మీదుగా ఆమెకు అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉంది’’ అని చెప్పారు.
జమున మాట్లాడుతూ ‘‘అరవింద్, సురేశ్బాబు నా బిడ్డల్లాంటి వాళ్లు.. సినిమా పరిశ్రమ గర్వించదగ్గ నిర్మాతలుగా ఉండడం ఆనందదాయకం. సురేష్ కొండేటి ఈ అవార్డును అందజేయడం ఎంతో సంతోషంగా ఉంది’’ అన్నారు.
ఆమె సన్మాన కార్యమ్రంలో పాల్గొన్న రోజారమణి మాట్లాడుతూ ‘‘ఇక్కడ రెండు సంఘటను గుర్తుకు వస్తున్నాయి. జమున అమ్మకు కొడుకులా నేను నటిస్తే, కూతురుగా కుట్టి పద్మిని నటించింది. ఇద్దరూ ఒకే స్టేజీమీద వుండడం చాలా ఆనందాన్ని కల్గించింది. జమునగారు పెద్ద నటి అయినా స్వంత బిడ్డగా ప్రేమిస్తారు. సన్మానంలో మేం కూడా వుండడం సంతోషం’’ అన్నారు.