తెలుగు సినిమాలని రీమేక్ చేయడంలో బాలీవుడ్ దర్శకనిర్మాతలు ముందు వరుసలో ఉంటున్నారు. ఈ మధ్య వచ్చిన ప్రతీ తెలుగు సినిమాపై బాలీవుడ్ జనాలు కన్నేస్తున్నారు. సినిమా బాగా ఆడిందంటే మరో మాట ఆలోచించకుండా రీమేక్ హక్కులు కొనేస్తున్నారు. బాహుబలి ద్వారా బాలీవుడ్ లో సునామీ సృష్టించడం వల్ల ఇది సాధ్యమైందని చెప్పవచ్చు. ఇప్పటికే చాలా సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యాయి. మొన్నటికి మొన్న "కబీర్ సింగ్" ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ సినిమా తెలుగులో ఘన విజయం సాధించిన అర్జున్ రెడ్డికి రీమేక్ అన్న విషయం అందరికీ తెలిసిందే.


అయితే ప్రస్తుతం మరో సినిమా బాలీవుడ్ లోకి వెళ్ళనుందట. డాషింగ్ డైరెక్టర్ పురి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయనున్నారట. ఈ సినిమా తెలుగులో తిరుగులేని విజయం సాధించడంతో పాటు కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపింది. మాస్ సినిమాలు తీయడంలో దిట్ట అయిన పూరి మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. పూరి పనైపోయింది అనుకున్న వారికి ఇస్మార్ట్ విజయం ద్వారా తానేంటో చెప్పాడు. ఈ సినిమాలో రామ్ నటనకి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. మాస్ లుక్ లో రామ్ అద్భుతంగా చేశాడు.


ఈ సినిమా బాలీవుడ్ రీమేక్ లో హీరోగా రణ్ బీర్ కపూర్ నటించనున్నాడని సమాచారం. ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ హీరో రణ్ బీర్ కపూర్ అయితే దర్శక నిర్మాతలు ఎవరనేది ఇంకా తెలియలేదు. రణ్ బీర్ కపూర్ మాస్ లుకు లో బాలీవుడ్ జనాల్ని ఆకట్టుకుంటాడా లేదా చూడాలి. ఇస్మార్ట్ శంకర్ సినిమాని తమిళంలో కూడా రీమేక్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. తమిళ రీమేక్ లో హీరో ధనుష్ ని అనుకుంటున్నారట. మరి ఈ రెండు రీమేక్ లు ఉంటాయా? ఉండవా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: