యూఏఈ
గోల్డెన్ కార్డ్ వీసాని ఇప్పటివరకూ భారతీయులకి దక్కిన దాఖలాలు లేవు.ఈ వీసా కోసం
ఎంతో మంది ఎన్నారైలు వేచి చూస్తూ ఉంటారు. అలాంటిది ఓ భారతీయుడు మాత్రం ఈ వీసాని దక్కించుకుని
రికార్డ్ తిరగరాశాడు. దాంతో ఆతడి పేరు యూఏఈ లో మారుమోగిపోతోంది. ఇంతకీ ఎవరతను,
అతడు గోల్డెన్ వీసాని ఎలా సాధించుకున్నాడు అనే వివరాలలోకి వెళ్తే..
కేరళకి చెందిన యూసఫ్ అలీ అబుదాబిలో లులూ అనే కంపెనీని నడుపుతున్నాడు. అయితే యూఏఈలో అత్యధిక పెట్టుబడులు పెట్టిన ఎన్నారైలకి గోల్డెన్ కార్డ్ పర్మినెంట్ వీసాని ఇస్తామని అక్కడి ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. ఇందులో భాగంగా 6,800 మంది పెట్టుబడులు పెట్టిన వారి జాబితా తీయగా అందరిలో అందరికంటే కూడా యూసఫ్ ముందు స్థానంలో ఉన్నాడు. దాంతో స్థానిక ప్రభుత్వం అతడికి ఈ గోల్డన్ పెర్మినెంట్ వీసాని అందించింది.
ఇదిలాఉంటే అక్కడి ప్రభుత్వం ఇప్పటి వరకూ అత్యధిక నైపుణ్యం కలిగిన వివిధ రంగాల ఉద్యోగులకి ఐదేళ్ళ నుంచీ పదేళ్ళ వరకూ మాత్రమే వీసాని ఇస్తూ వచ్చింది. అయితే విదేశీ పెట్టుబడులని, ప్రతిభ ఉన్న వారిని ఆకర్షించి తమ దేశ అభివృద్దిలో భాగస్వాములని చేయడానికి ఈ వీసాని అమలులోకి తీసుకువచ్చారు. ఈ వీసా దక్కించుకున్న తొలి భారతీయుడిగా తాను రికార్డ్ క్రియేట్ చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు యూసఫ్.