దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోగ్రఫీ
ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి
పదవీ కాలంః 2004-2009
నియోజకవర్గంః పులివెందుల
వ్యక్తిగత వివరాలుః జననం 8 జూలై 1949
పులివెందుల, ఆంధ్ర ప్రదేశ్
మరణంః 2009 సెప్టెంబర్ 2న వెలుగొండ
రాజకీయ పార్టీః భారత జాతీయ కాంగ్రెసు
భాగస్వామిః విజయలక్ష్మి
సంతానంఃవై.యస్. జగన్మోహన్ రెడ్డి (కుమారుడు) షర్మిలా (కుమార్తె)
ఆయన జూలై 8, 1949న కడప జిల్లా పులివెందులలో జన్మించారు.
వైఎస్ బాల్యం, విద్యాభ్యాసం
ప్రజలు ఎంతో అభిమానంతో వైఎస్గా పిలిచే రాజశేఖర్ రెడ్డి పూర్తి పేరు.. వైయెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి. జూలై 8, 1949 న కడప (వైఎస్ఆర్) జిల్లా, జమ్మలమడుగులోని సి.ఎస్.ఐ. కాంప్బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించాడు.ఆయన తల్లిదండ్రులు జయమ్మ, రాజారెడ్డి. ఆయన తండ్రి బళ్ళారిలో కాంట్రాక్టరుగా పనిచేస్తుండటం వల్ల ఆయన పాఠశాల చదువంతా బళ్ళారిలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో సాగింది. ఆ తర్వాత విజయవాడ లయోలా కళాశాలలో చేరాడు. 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్యవిద్యలో పట్టా పుచ్చుకున్నాడు. గుల్బర్గాలోని మహాదేవప్ప రాంపూరే వైద్య కళాశాలలో వైద్యవృత్తిని అభ్యసిస్తుండగానే కళాశాల విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. శ్రీ వెంకటేశ్వర వైద్యకళాశాల, తిరుపతి నుంచి హౌస్ సర్జన్ పట్టా పొందాడు వైఎస్. విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు ఆకర్షితుడైన రాజశేఖరరెడ్డి ఎస్వీ.ఆర్.ఆర్ కళాశాలలో పనిచేస్తుండగానే అక్కడ హౌస్సర్జన్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
తరువాత కొద్దిరోజులపాటు జమ్మలమడుగులోని సి.ఎస్.ఐ. కాంప్బెల్ ఆసుపత్రిలో వైద్య అధికారిగా పనిచేశాడు. ఆ తరువాత 1973లో పులివెందులలో తండ్రి వై.ఎస్.రాజారెడ్డి పేరుతో కట్టించిన 70 పడకల ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేశాడు. ఆ ఆసుపత్రి ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. వాళ్ళ కుటుంబం పులివెందులలో ఒక పాలిటెక్నిక్ కళాశాలతో పాటు డిగ్రీ కళాశాలను కూడా నెలకొల్పింది. తరువాత వాటి నిర్వహణను లయోలా సంస్థలకు అప్పగించారు. పులివెందుల దగ్గరిలో ఉన్న సింహాద్రిపురంలో ఉన్న కళాశాలను మాత్రం ఇప్పటికీ వైఎస్ కుటుంబమే నిర్వహిస్తోంది.
కుటుంబం
వై.యస్. రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి. వారికి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు జగన్మోహన్ రెడ్డి .. వైఎస్ మరణానంతరం వైఎస్ ఆర్ సీపీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కడప లోక్సభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.ఆయన చాలా వ్యాపారాలతో పాటు సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ చానల్ కూడా నిర్వహిస్తున్నాడు. కూతురు షర్మిళ సైతం పార్టీ వ్యవహరాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ బార్య విజయలక్ష్మీ సైతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
రాజకీయ జీవితం
కళాశాల దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపిన రాజశేఖర రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తొలి సారిగా 1978లో కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనసభకు పోటీ చేశారు. అప్పట్లో జనతాపార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని విజయం సాధించారు. తొలిసారి గెలిపొందిన వెంటనే మంత్రిపదవి పొందారు వైఎస్. ఆ తరువాత వెనువెంటనే ముగ్గురు ముఖ్యమంత్రులు మారినా ఆ మూడు మంత్రి మండళ్లలో స్థానం సంపాదించారు రాజశేఖర్ రెడ్డ. అయితే ఆ తరువాత చాలా కాలం పాటు ఎటువంటి ప్రభుత్వ పదవీ దక్కలేదు.1980-83 కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిపదవిని నిర్వహించాడు. కడప లోక్సభ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎన్నికయ్యాడు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 సార్లు విజయం సాధించాడు. రాష్ట్ర శాసనసభ ప్రతిపక్షనేతగానూ, రెండు సార్లు రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడిగానూ పనిచేశాడు. 1980 నుంచి 1983 దాకా గ్రామీణాభివృద్ధి, వైద్యశాఖ, విద్యాశాఖ మొదలైన కీలకమైన మంత్రి పదవులను నిర్వహించాడు. తెలుగు దేశం నేత నారా చంద్రబాబు నాయుడు మొదటగా కాంగ్రెస్ లో ఉన్నపుడు ఇరువురూ మంచి మిత్రులు. 1985 నుంచి 1998 వరకు పార్టీలో వై.ఎస్. నిత్య అసమ్మతివాదిగా పేరుపడ్డారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరితో ఆయన పోరాటం చేయాల్సి వచ్చింది. 1989-94 మధ్య
కాలంలో ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి వంటి నేతలతో ఆయన రాజకీయ యుద్ధమే చేశారు. వారికి వ్యతిరేకంగా క్యాంపులు నడిపారు. మర్రి చెన్నారెడ్డిని, నేదురుమిల్లి జనార్ధన్రెడ్డిని పదవినుండి తొలగించడానికి ప్రధాన కారణమైన హైదరాబాదు నగరంలో జరిగిన అల్లర్లలో రాజశేఖర్ రెడ్డి వర్గపు పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి. అదే తాను ముఖ్యమంత్రి అయ్యేనాటికి అలాంటి శిబిరాలు లేని పరిస్థితిని సృష్టించుకోగలిగాడు వైఎస్. రాజకీయాల్లో ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా వ్యవహరిస్తారని వైఎస్కు పేరుండేది.
పిసిసి అధ్యక్షుడిగా
ఆంధ్ర ప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి రెండు సార్లు పనిచేశారు. తొలిసారి 1983 నుంచి 1985 వరకు మొదటి దఫా రెండో పర్యాయం 1998 నుంచి 2000 వరకు ఆ పదవిలో ఉన్నారు. 1999 నుంచి 2004 వరకు 11 వ శాసనసభలో ప్రతిపక్షనేతగానూ వ్యవహరించారు.ఈ సమయంలోనూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సభలో పలుమార్లు ఇరుకున పెట్టి ప్రజలకు మరింత చేరువయ్యారు.
పాదయాత్ర
2003 వేసవికాలంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి 1,467 కిలోమీటర్లు పర్యటించారు. వైఎస్కు ప్రజలు జన హారతి పట్టారు. అప్పటి రాజకీయ పరిస్థితులు, కరువు ఇలా ఎన్నో అంశాలు వైఎస్కు ప్రజల్లో ఎంతో ఆదరణ తెచ్చిపెట్టాయి. పాదయాత్ర వలన వ్యక్తిగతంగా వైఎస్.కు మంచి జనాదరణ లభించడమే కాకుండా ఆ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది. అప్పట్లో ఉచిత విద్యుత్ ప్రచారం అతని విజయానికి బాటలు పరచిందని చెప్పాలి. 2004 ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుంచి 40వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందడంతో ముఖ్యమంత్రి పీఠం వై.ఎస్.రాజశేఖరరెడ్డికే దక్కింది.
ముఖ్యమంత్రిగా
2004 మే లో జరిగిన 12వ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికస్థానాలు సాధించడంతో అదివరకే పార్టీలో పేరుసంపాదించిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడు. పాదయాత్ర వలన జనాదరణ పొందడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పెండింగులో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేయటం, జలయజ్ఞంలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పిదప తొలి సంతకం ఉచిత విద్యుత్తు ఫైలు పైనే చేశారు. 2009 ఏప్రిల్లో జరిగిన 13వ శాసనసభ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలలో విజయం సాధించడానికి కృషిచేసి వరుసగా రెండో పర్యాయం
ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు వైఎస్. గుల్బార్గా లో వైద్యవిద్య చదువుతున్నప్పటి నుంచీ ఆయనకు అత్యంత ఆప్తమిత్రుడు కె.వి.పి. రామచంద్రరావు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాక ఆయన్ను సలహాదారుగా నియమించుకున్నాడు. కేవీపిని ప్రతిపక్షాలు వైఎస్ ఆత్మగా విమర్శిస్తుంటాయి.
2009 ఎన్నికలు
2009 ఏప్రిల్లో జరిగిన శాసనసభ, లోక్సభ ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముందుండి నడిపించడమే కాకుండా శాసనసభలో 156 స్థానాలతో పూర్తి మెజారిటీని సంపాదించిపెట్టారు. అదేసమయంలో లోక్సభ ఎన్నికలలో 33 స్థానాలలో విజయం సాధించడానికి కృషిచేసి దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు సంపాదించిపెట్టిన రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ను కాంగ్రెస్ అధిష్టానం ముందు సగర్వంగా నిలబెట్టారు వైఎస్.
పదవులు
1975: యవజన కాంగ్రెస్ కార్యదర్శిగా నియామకం.
1980: తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా నియామకం.
1982: రాష్ట్ర మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖా మంత్రి పదవి లభించింది.
1982: రాష్ట్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా నియామకం.
1983: పిసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు (1985 వరకు).
1998: రెండోసారి పిసిసి అధ్యక్షుడిగా నియామకం (2000 వరకు).
1999: శాసనసభ ప్రతిపక్షనేతగా ఎన్నికయ్యారు.
2004: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.
2009: రెండోపర్యాయం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.
విజయాలు
1978: పులివెందుల నుంచి తొలిసారి శాసనసభ్యుడిగా గెలుపొందినాడు.
1983: పులివెందుల నుంచి రెండోసారి శాసనసభ్యుడిగా విజయం.
1985: పులివెందుల నుంచి వరుసగా మూడవసారి శాసనసభ్యుడిగా హాట్రిక్ విజయం.
1989: కడప నియోజకవర్గం నుంచి తొలిసారి లొకసభ సభ్యుడిగా విజయం.
1991: కడప నియోజకవర్గం నుంచి రెండోసారి గెలుపు.
1996:కడప నుంచి వరుసగా మూడవసారి గెలుపొంది హాట్రిక్ సాధించాడు.
1998: కడప నుంచి వరుసగా నాలుగవసారి ఎన్నికలలో విజయం సాధించాడు.
1999: పులివెందుల నుంచి నాలుగవసారి శాసనసభ్యుడిగా గెలుపు.
2004: పులివెందుల నుంచి ఐదవసారి శాసనసభ్యుడిగా విజయసాధించాడు.
2009: పులివెందుల నుంచి రెండోసారి హాట్రిక్ విజయం, శాసనసభ్యుడిగా గెలుపొందడం ఆరవసారి.
వివాదాలు, విమర్శలు
వైఎస్ తన పాలన. పథకాలతో ఎంత మంచి పేరు సంపాదించారో ఆయన చుట్టూ ఎన్నే వివాదాలు కూడా ముసురుకున్నాయి. 1600 ఎకరాల భూమిని డిసెంబర్ 2006లో ప్రభుత్వానికి అప్పగించటం విపక్షాల విమర్శకి గురయ్యింది. చట్టాన్ని అతిక్రమించి భూమిని కలిగివున్నందుకు విపక్షాలు రాజశేఖరరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ముఖ్యమంత్రి పదవిలొ ఉన్నప్పుడు ఎన్నో అక్రమ ఆస్తులు సంపాదించారని విపక్షాలు, పత్రికలు ఆయనపై ఆరోపణలు చేసాయి. అక్రమ ఆస్తుల సంపాదన కేసులో 2011లో ఆయనపైనే కాకుండా ఆయన కుమారుడు జగన్ పై సి.బి.ఐ అభియోగ పత్రం జారీ చేసింది.
అదివరకు ఏ ముఖ్యమంత్రిపై రాని అవినీతి విమర్శలు వైఎస్సార్ పై వచ్చాయి. వైఎస్సార్ కేబినెట్లో పనిచేసిన మంత్రులు సైతం వైఎస్సార్ పై విమర్శలు కురిపించారు. కేంద్రమంత్రులు, ప్రస్తుత రాష్ట్రమంత్రులు కూడా విమర్శలు లేవదీశారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని లూటీచేశాడని పలువురు ఆయనపై విమర్శలు చేశారు. వైఎస్సార్ హయంలో బాక్సైట్ గనులను అడ్డగోలుగా, కీలక చట్టాలను తుంగలో తొక్కి మరీ ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్ కాలంలో జరిగిన భూపంపిణీని కాగ్ సైతం తప్పుపట్టింది. వైఎస్ కాలంలో ఆయన కుటుంబం మాత్రమే బాగుపడింది కాని సామాన్య
ప్రజలు బాగుపడలేరని చంద్రబాబునాయుడు విమర్శించారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తనయుడి సంస్థలలో అనుమాస్పద రీతిలో వేలకోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చిచేరినట్లు కాగ్ అక్షింతలు వేసింది. రాంకీ సంస్థకు ప్రయోజనాలు కల్పించడానికి దాని చైర్మెన్ అయోధ్య రామిరెడ్డితో కలిసి వైఎస్సార్ కుట్ర పన్నినట్లు సీబీఐ వెల్లడించింది. ఇలా అనేక విమర్శలు ఎదుర్కొన్నారు వైఎస్.
క్రైస్తవ్యం
వై.యస్. రాజశేఖరరెడ్డి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనే చర్చికి చెందిన ప్రొటెస్టెంటు క్రైస్తవుడు. ఈయన తాత బ్రిటీషు మిషనరీల ప్రభావంతో క్రైస్తవమతం పుచ్చుకున్నాడని, తండ్రి రాజారెడ్డి మిలటరీలో పనిచేస్తూ బర్మాలో ఉండగా, అక్కడ క్రైస్తవం పుచ్చుకున్నాడని రెండు వేర్వేరు కథనాలు ఉన్నాయి. క్రైస్తవులైనా పారంపరికంగా వచ్చిన హిందూ సాంప్రదాయాలని వీడలేదు. రాజశేఖరరెడ్డి తిరుమలను అనేకమార్లు సందర్శించి వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకొని పూజలు చేశాడు. ఆయన అల్లుడు అనిల్ కుమార్ మత ప్రచారకుడు. బ్రాహ్మణుడైన అనిల్ కుమార్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మీలాను పెళ్ళి చేసుకున్న తర్వాత క్రైస్తవం స్వీకరించి మతప్రచారకుడయ్యాడు. ఈయన ప్రాభవం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే పెరగడంతో ఎన్నో విమర్శలకు ఊతమిచ్చినట్టైంది.
హెలికాప్టర్ ప్రమాదంలో మృతి
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి బయలుదేరగా ఉదయం గం.9.35 నిమిషాలకు హెలికాప్టరుతో సంబంధాలు తెగిపోయాయి. ఆయన ఆచూకీ కోసం గాలించగా 25 గంటల తరువాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్ళు లభించాయి. ప్రమాదస్థలమైన రుద్రకొండ కర్నూలు-ప్రకాశం జిల్లా సరిహద్దులో ఆత్మకూరు - వెలుగోడుకు సమీపంలోని నల్లమల అడవుల్లో ఉంది. హెలికాప్టర్ కూలిన ప్రాంతం కర్నూలు జిల్లా ఆత్మకూరునుంచి 8 కిలోమీటర్ల దూరంలోని నల్లకాలువ గ్రామం మీదుగా 16 కిలోమీటర్ల దూరంలోని రుద్రకోడూరు గ్రామానికి దట్టమైన అటవీ మార్గంలో ప్రమాద స్థలి మరో 16 కిలోమీటర్లు దూరం ఉంది. వై.ఎస్.తో సహా మొత్తం ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తమ అభిమాన నాయకుని మరణాన్ని జీర్ణించుకోలేక రాష్ట్ర మంతా దాదాపు 67 మంది మరణించారని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. వీరిలో చాలా మంది గుండె ఆగి మరణించగా కొద్ది మంది ఆత్మహత్య చేసుకున్నారు.
ప్రమాదంపై విచారణ సంఘము
నల్లమల అడవులలో సంభవించిన హెలికాప్టర్ దుర్ఘటనపై కేంద్ర ప్రభుత్వం విచారణ సంఘాన్ని నియమించింది. పవన్హన్స్
హెలికాప్టర్ లిమిటెడ్ యజమాని ఆర్.కె.త్యాగి ఈ విచారణ కమిటీకి నేతృత్వం వహించారు.
వైఎస్ ముఖ్యమంత్రిగా ఎంతమంచి పేరు సంపాదించుకున్నారో.. పాలనలో అక్రమాలు, అయిన వారికి దోచి పెట్టారని అన్నే విమర్శలు ఎదుర్కొన్నారు. మొత్తానికి జన హృదయ నేతగా వైఎస్ తెలుగు ప్రజల గుండెల్లో చరగని ముద్ర వేశారు.