నగరం పల్లె బాట పడుతోంది.. సంక్రాంతి సెలవులకు అంతా సొంతూళ్లకు పయనమవుతున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజలు తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. హైదరాబాద్ నగరం నుంచి తమ స్వస్థలాలకు చేరుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల్లో పెద్ద సంఖ్యలో బయలుదేరడంతో ఈ రోజు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది.
వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో నల్గొండ జిల్లా చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద పన్ను చెల్లించేందుకు వాహనాలు బారులు తీరాయి. దీంతో అక్కడి నుంచి వాహనాలు మెల్లిగా ముందుకు కదులుతున్నాయి. విజయవాడ టు హైదరాబాద్ అలాగే హైదరాబాద్ టు విజయవాడ వైపు వచ్చే వాహనాలు నత్తనడకన ముందుకు వెళుతున్నాయి. దీంతో జాతీయ రహదారిపై దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది.
హైదరాబాద్-విజయవాడ రూట్ రష్గా మారింది. టోల్ గేట్ల దగ్గర పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. పంతంగి టోల్ గేట్ దగ్గర కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్గేట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో టోల్ అధికారులు రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కువ గేట్లను విజయవాడవైపు వెళ్లే వాహనాల కోసం కేటాయించారు.