సచిన్.. క్రికెట్ ఆరాధ్య దైవం. సచిన్ పేరు వినబడితే చాలు క్రికెట్ దేవుడని ఠక్కున చెప్పేస్తారు. అలాగే బాలీవుడ్ లో రేఖ పేరు చెప్తే అందమైన రూపం కళ్లలో మెదులుతుంది. ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసిన రేఖ.. ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అందుకే వాళ్లిద్దరికీ సముచిత స్థానమిచ్చింది భారత ప్రభుత్వం. రేఖ, సచిన్ లను రాజ్యసభకు నామినేట్ చేసింది. అయితే వాళ్లకు, విజయ్ మాల్యాకు పెద్ద తేడా లేదంట..!
సచిన్ టెండూల్కర్, రేఖ.. వీళ్లిద్దరూ ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు. నాటి యూపీఏ ప్రభుత్వం క్రికెట్ లో సచిన్ చేసిన సేవలకుగానూ భారత రత్న పురస్కారంతో గౌరవించింది. అంతేకాదు.. రాజ్యసభకు పంపింది. పిన్నవయసులోనే రాజ్యసభ మెంబర్ అయిన చరిత్రను కూడా సచిన్ దక్కించుకున్నాడు. అలాగే బాలీవుడ్ లో దుమ్మురేపిన రేఖను కూడా రాజ్యసభకు పంపించి గౌరవించింది.
అయితే .. వీళ్లిద్దరూ రాజ్యసభ సమావేశాలకు పెద్దగా అటెండ్ అవ్వరు. తాము రాజ్యసభ సభ్యులమనే స్పృహ కూడా వీళ్లకు లేనట్టుంది. కానీ రాజ్యసభ సభ్యుడిగా అందే ప్రయోజనాలన్నింటిని చక్కగా అందుకుంటున్నారు.. అనుభవిస్తున్నారు. అందుకే తోటి సభ్యులకు వీళ్లపై చిర్రెత్తుకొచ్చింది. వీళ్లు సమావేశాలకు ఎందుకు రావడం లేదంటూ సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ ధ్వజమెత్తారు. అంత తీరిక లేకుంటే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అంతటితో ఆగని నరేశ్ అగర్వాల్... సచిన్ , రేఖలను దేశం విడిచి పారిపోయిన కింగ్ ఫిషర్ గ్రూప్ యజమాని విజయ్ మాల్యాతో పోల్చారు. విజయ్ మాల్యాను సభ నుంచి సస్పెండ్ చేసినప్పుడు.. వీళ్లను ఎందుకు బహిష్కరించలేమని ప్రశ్నించారు. వీళ్లపై నరేశ్ ప్రశ్నించడం ఇది తొలిసారి కాదు.. గతంలో కూడా ఓసారి వీళ్లు సభకు రాకపోవడంపై నిలదీశారు. కానీ రేఖ, సచిన్ లు మారలేదు.