దేశవ్యాప్తంగా తమ వ్యూహాలకు పదునుపెడుతున్న బీజేపీ.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ పై కన్నేసింది. ఎలాగైనా ఆ రాష్ట్రాన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో స్ట్రాటజీ రూపొందిస్తోంది. ఇప్పటికే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారిపోవడంతో.. బెంగాల్ ను కైవసం చేసుకోవడానికి దీన్ని మించిన మంచి సమయం లేదని మోదీ టీం ఆలోచిస్తోంది. అందుకు ఏం చేయబోతోందో తెలుసా..?
బెంగాల్ లో కాంగ్రెస్, కమ్యూనిస్టుల కంచుకోటలను మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ బద్దలుకొట్టింది. ఇప్పుడు మమత కోటను కొల్లగొట్టేందుకు మోదీ టీం పక్కా ప్లాన్ రూపొందించింది. మమతకు ముఖ్య అనుచరుడిగా ఉన్న ముకుల్ రాయ్ కు గాలం వేసినట్లు తెలుస్తోంది. ముకుల్ రాయ్ టీఎంసీలో సీనియర్ నేత. మమత బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా పేరొందారు. ఓ విధంగా చెప్పాలంటే మమత తర్వాత నెంబర్ టూ ముకుల్ రాయే.!
ముకుల్ రాయ్ ని పార్టీలోకి లాగడం ద్వారా మమత బెనర్జీని గట్టి దెబ్బ తీయవచ్చనేది బీజేపీ ఆలోచన. ముకుల్ రాయ్ మంచి వ్యూహకర్తగా కూడా పేరొందాడు. పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో ఆరోపణలు రావడంతో ఆయన్ను పార్టీ నుంచి తొలగించారు మమత బెనర్జీ. అయితే ఆ మరుసటి ఏడాదే మళ్లీ పార్టీలో చేర్చుకున్నారు. ఇటీవలికాలంలో మకుల్ రాయ్ కు ప్రయారిటీ ఇవ్వట్లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అందుకే పార్టీ నుంచి ఆయన బయటపడాలనుకుంటున్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి.
అయితే.. బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలను ముకుల్ రాయ్ ఖండించారు. తనకు అలాంటి ఆలోచన ఏదీ లేదన్నారు. అయితే ఇదే సమయంలో త్రిపురలో ఆరుగురు టీఎంసీ ఎమ్మెల్యేలు పార్టీకు గుడ్ బై చెప్పి.. బీజేపీలో చేరుతున్నారు.