అసెంబ్లీ సమావేశాలు మొదలు అవ్వబోతున్న రోజున అంటే ఇవాళే ఛలో అసెంబ్లీ ప్రోగ్రాం పెట్టింది కాంగ్రెస్ పార్టీ . తెలంగాణా లో తమ స్థాయి ని ఎలాగైనా సరే పెంచాలి అని చూస్తున్న కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పెట్టారు.
రైతులు అందరూ కలిసి ఇందులో పాల్గొనాలి అని ఆయన కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు అందరూ తీవ్రమైన సమస్యలు ఎదురుకొంటూ ఉన్నారు అనీ వారందరూ ఇవాళ స్వచ్చందంగా తరలి వస్తారు అనేది ఆయన మాట. అడ్డుకునే ప్రయత్రాలు చేస్తే.. తెరాస సర్కారు పతనం అక్కడి నుంచే ప్రారంభం అని అంటున్నారు.
ఇలాంటి ఒక కార్యక్రమం కోసం కోమటిరెడ్డి చాలా కాలం నుంచీ ఎదురు చూస్తున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఛలో అసెంబ్లీ విజయవంతం చేసుకోవడం ఆయనకి ఒక రాజకీయ అవసరం కూడా. కాంగ్రెస్ లో ఉండే వర్గపోరు తెలిసిందే పీసీసీ రేసు లో కూడా తాను ఉన్నాను అని కోమటిరెడ్డి ఎప్పటి నుంచో చెబుతున్నారు.
పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా రేసులో కూడా ఉంటా అన్నారు ఆయన. సో… ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఛలో అసెంబ్లీని విజయవంతం చేసుకోవడం, తద్వారా అధినాయకత్వానికి తన ప్రతిభను చాటుకోవడం అనేది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. అయితే, కోమటిరెడ్డి నాయకత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇతర నేతల సహకారం ఏ స్థాయిలో ఉంటుందో వేచి చూడాలి.