ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఓ వైపు అధికార పక్షంతో అంటకాగుతూనే చాపకింద నీరులా పార్టీని విస్తరించే ప్రయత్నాలు సాగిస్తోంది. ఏపీ బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్న పురంధేశ్వరి ఆ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. ఇతర పార్టీల సీనియర్ నేతలను కమలం గూటికి చేర్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా రాయలసీమపై ఫోకస్ పెట్టిన పురంధేశ్వరి ఒకరిద్దరు నేతలతో చర్చలు కూడా జరిపారు.
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ విస్తరణ దిశగా అడుగులు వడివడిగా పడుతున్నాయి. పైకి చెప్పకపోయినా అమిత్ షా డైరెక్షన్ లో అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ నేతలు కూడా ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రారంభించేశారు. సీఎం సొంత జిల్లా చిత్తూరు నుంచే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది.
బీజేపీ సీనియర్ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాజీ ఎమ్మెల్యే సీకేబాబు నివాసానికి వెళ్లడం, ఆయనతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో సంచలనాన్ని సృష్టిస్తోంది. సీకేబాబు బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారైనట్లు సంకేతాలు రావడంతో చిత్తూరు రాజకీయాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. చిత్తూరులో పార్టీ కార్యక్రమానికి వచ్చిన తాను.. సీకే బాబు ఆహ్వానం మేరకే వారి ఇంటికి వెళ్లానన్న పురంధేశ్వరి అసలు విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. సీకే బాబు పార్టీలో చేరేది లేనిది మీ ఊహకే వదిలేస్తున్నానంటూ తప్పకున్నారు.
చిత్తూరు జిల్లాలో సీకే బాబు సీనియర్ నేత. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డికి ముఖ్య అనుచరిడిగా గుర్తింపు పొందారు. వై.ఎస్. మరణం తర్వాత చాలాకాలం పాటు కాంగ్రెస్ లోనే కొనసాగిన ఆయన.. ఆ తర్వాత వైసీపీలో చేరారు. అయితే అక్కడ కూడా తనకు తగిన గుర్తింపు లేదని ఇటీవలికాలంలో ఫీలవుతున్నారు. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి ఆయనతో సమావేశం కావడంతో.. సీకే బాబు బీజేపీలో చేరుతారనే ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది.
చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభమైన బీజేపీ వేట త్వరలోనే మిగిలిన జిల్లాలకు విస్తరించే అవకాశం ఉంది. ప్రధానంగా కాంగ్రెస్, వైసీపీ లకు చెందిన ముఖ్యనేతలను బీజేపీ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. టీడీపీ నుంచి ఎవరూ బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా లేరు. బీజేపీ కూడా టీడీపీ నేతల వైపు చూడడం లేదు. కాంగ్రెస్ నేతలపైనే బీజేపీ ఫోకస్ ఎక్కువగా కనిపిస్తోంది. కొంతమంది కాంగ్రెస్ నేతలు అటు టీడీపీలో, ఇటు వైసీపీలో చేరలేక ఇబ్బందులు పడుతున్నారు. మొదట అలాంటివారిని చేర్చుకోవాలని చేర్చుకోవాలని బీజేపీ ఆలోచిస్తోంది. మరి చూద్దాం.. బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో..!!