ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.75.06 కోట్లు. వీరి కుటుంబం నిర్వహిస్తున్న హెరిటేజ్ సంస్థ వార్షిక ఆదాయం రూ.2648 కోట్లు కాగా ఖర్చు రూ.2501కోట్లు. పన్నుల చెల్లింపుల అనంతర నికర లాభం రూ.66.82కోట్లు. తనతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి, బ్రహ్మణి, దేవాన్ష్ ఆస్తులను మంత్రి నారా లోకేశ్ అమరావతిలోని సీఎం నివాసంలో ప్రకటించారు. .
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబసభ్యుల ఆస్తులను ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. చంద్రబాబు నికర ఆస్తి విలువ రూ.2 కోట్ల 53 లక్షల రూపాయలు కాగా... భువనేశ్వరి నికర ఆస్తులు రూ.25.41 కోట్లు. లోకేశ్ ఆస్తుల విలువ రూ15.21 కోట్లు కాగా ఆయన సతీమణి బ్రహ్మణి నికర ఆస్తుల విలువ రూ.15.01 కోట్లుగా వెల్లడించారు. దేవాన్ష్ నికర ఆస్తులు 11.54కోట్లు రూపాయలని తెలిపారు. అయితే ఇవన్నీ కొనుగోలు ధరలు మాత్రమేనని లోకేశ్ క్లారిటీ ఇచ్చారు. మార్కెట్ విలువ ప్రకారమే ఆస్తుల విలువ మారుతూ వస్తోందన్నారు.
తమ కుటుంబ ఆస్తులను ప్రకటిస్తూ రావటం ఇది వరుసగా ఏడోసారని తెలిపారు. దేశంలో మరే రాజకీయ కుటుంబం తమ మాదిరిగా ఆస్తులు ప్రకటించట్లేదని చెప్పారు. తమ కుటుంబంపై కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని.. అలా చేసేవాళ్లు ఏనాడైనా వారి ఆస్తులు ప్రకటించారా? అని లోకేష్ ప్రశ్నించారు. పద్ధతి ప్రకారం వ్యాపారం చేయడం తప్పుకాదని స్పష్టం చేశారు.
శుక్రవారం తాము ధైర్యంగా ఆస్తులు ప్రకటించామని.. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లడం జడ్జీ ముందు చేతులు కట్టుకుని నిలబడడం జగన్ కు అలవాటై పోయిందని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఈ రెండిటికి మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారని లోకేష్ తెలిపారు. అవినీతి ఆరోపణలు చేసే ముందు ఆస్తులు ప్రకటించి విమర్శలు చేస్తే మంచిదని హితవు పలికారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెరిటేజ్పై 27 కేసులు వేశారని.. అయితే ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారని గుర్తు చేశారు.
చంద్రబాబు నికర ఆస్తి విలువ రూ.2.53 కోట్లు
భువనేశ్వరి నికర ఆస్తులు రూ.25.41 కోట్లు
లోకేశ్ ఆస్తుల విలువ రూ.15.21 కోట్లు
బ్రహ్మణి నికర ఆస్తుల విలువ రూ.15.01 కోట్లు
దేవాన్ష్ నికర ఆస్తులు రూ.11.54కోట్లు