తెలంగాణలో ఇప్పుడు రైతుబంధు పథకం హల్ చల్ చేస్తోంది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ఎన్నికల ముందు కేసీఆర్ రైతులను ప్రసన్నం చేసుకునేందుకే ఈ ఎత్తుగడ వేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కేసీఆర్ మాత్రం ఇది ఎన్నికల స్టంట్ కానే కాదని స్పష్టం చేస్తున్నారు. అవగాహన లేక, లెక్కలు రాక కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు పథకం కేసీఆర్ సర్కార్ లో మరింత జోష్ నింపింది. రైతుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఇటు పార్టీ క్యాడర్ సైతం మరింత ఉత్సాహంగా పనిచేస్తోంది. అయితే పల్లెల్లో పండుగలా సాగుతున్న రైతుబంధు పథకం కేవలం ఓట్ల కోసమేనని, డైరెక్ట్ గా డబ్బులు పంచలేక ఇలా పథకం పేరుతో పంచుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు గుప్పించారు. తాము అధికారంలోకొస్తే ఎన్నడు లేనంతగా ప్రతి రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు.
రైతుబంధు పథకంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను సీఎం కేసీఆర్ తిప్పికొట్టారు. రైతు బంధు రైతులకు బంధువేనని ఓట్ల కోసం నీచరాజకీయాలు చెయ్యాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. లెక్కలు తెలియకుండా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు రెండు లక్షల రుణమాఫీ ఎలా చేస్తారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. అన్నిరకాలుగా తెలంగాణలో నెలకు పదివేల 500 కోట్లు ఆదాయం వస్తుంటే అందులో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు, ప్రభుత్వం చేసే ఖర్చుల కిందే మొత్తం పోతున్నాయని ఇక రైతులకు ఎక్కడనుంచి తెస్తారని సీఎం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించినట్లు రెండులక్షల రుణమాఫీ ఇవ్వాలంటే ఉద్యోగులకు 20నెలలు జీతాలు ఆపాలటూ చెప్పుకొచ్చారు.
ఇప్పటికే తెలంగాణలో 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడంతోపాటు.. 2019 జూన్ కల్లా ప్రాజెక్ట్ లు పూర్తవుతాయని అప్పుడు సాగునీరు పుష్కలంగా అందుతుందన్నారు కేసీఆర్. నీళ్లు, కరెంట్ ఇవ్వడంతో పాటు పెట్టుబడి సహాయం అందిస్తున్నామని ఇక రైతులకు బంగారం పండిస్తారని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు రెండోవిడత రైతుబంధు ఆర్థిక సహాయాన్ని నవంబర్ లో ఇవ్వనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.