టీడీపీ రాజ్య సభ సభ్యుడు సీఎం రమేష్ కడప లో ఉక్కు ఫ్యాక్టరీ కోసం వారం రోజుల నుంచి ఉక్కు దీక్ష చేస్తున్న సంగతీ తెలిసిందే. అయితే బీజేపీ ప్రభుత్వ వైఖరి గురించి తెలిసి కూడా ఈ టైం లో దీక్ష కాదు కదా ఏం చేసిన ఫ్యాక్టరీ వచ్చే పరిష్టితి లేదన్న సంగతీ అందరికీ తెలిసిందే. ఆఖరికీ టీడీపీ వారికి కూడా తెలుసు. అయితే ఈ ఆరాటం దేనికి... దీనికి ఒకటే సమాధానం రాయలసీమ లో నాలుగు ఓట్లు సంపాదించుకుందామని...!
రాయలసీమలో అనంతపురం మినహా మిగిలిన మూడు జిల్లాల్లో టీడీపీ 2014 ఎన్నికల్లో పెద్దగా సీట్లు సాదించలేదు. 2019 ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఇప్పుడైనా పట్టు సాధించాలనే పట్టుదలతో టీడీపీ అధిష్టానం ఉంది. ఇందులో భాగమే ఉక్కు దీక్ష. రాయలసీమలో ఓట్ల ఆకలి తీర్చుకునేందుకు టీడీపీ ఆవురావురమని ఉంది. రమేష్నాయుడు చేపట్టిన ఆమరణదీక్షతోనైనా ఓట్ల కడుపు నింపుకోవచ్చని సీఎం చంద్రబాబు ఎత్తుగడ వేశారు.
ఈ దీక్షతో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ దేవుడెరుగు...ఓట్ల ఫ్యాక్టరీ నిర్మాణానికి పునాదులు పడినట్టేనని టీడీపీ శ్రేణులు సంబరపడుతున్నాయి. దీక్షా వేదికగా ప్రధాని మోడీతో పాటు రాష్ర్టానికి ద్రోహం చేస్తున్న బీజేపీతో వైసీపీ అధినేత జగన్ అంటకాగుతున్నారని రాష్ర్ట నలుమూలల నుంచి తరలివచ్చిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలే కాదు ఊరూపేరూ లేని వారితో సైతం విమర్శలు గుప్పించి ఓట్ల ఫ్యాక్టరీ నిర్మాణానికి సరంజామా తోలారు. ఈ సరంజామాతో సార్వత్రిక ఎన్నికల నాటికి తప్పకుండా ఓట్ల ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయి ప్రతిపక్ష వైసీపీ కోటలకు బీటలు పడక తప్పదని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.