పాదయాత్రలో భాగంగా వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు 100 నియోజకవర్గాలు కవర్ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గంలోకి అడుగుపెట్టటం ద్వారా జగన్ 100 నియోజకవర్గాల మైలురాయిని అధిగమించారు. జగన్ ప్రజా సంకల్పయాత్ర మొదలుపెట్టి ఈరోజుకు 222 రోజులు పూర్తయ్యింది. పోయిన ఏడాది నవంబర్ 6వ తేదీన సొంతూరైన కడప జిల్లా పులివెందులలో జగన్ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి అందరికీ తెలిసిందే.
లక్ష ఫిర్యాదులొచ్చాయి
ప్రజా సంకల్పయాత్రలో ఇప్పటి వరకూ 9 జిల్లాల్లో పాదయాత్రను పూర్తి చేసుకున్న జగన్ పదో జిల్లా అయిన తూర్పు గోదావరిలో పర్యటిస్తున్నారు. ప్రజలతో మమేకమవతుంది, సమస్యలు వింటూ పరిష్కారాలు సూచిస్తూ, భరోసా ఇస్తూ తన పాదయాత్రలో సాగుతున్నారు. వివిధ సమస్యలపైన జగన్ ఇప్పటి వరకూ సుమారు లక్ష వరకూ ఫిర్యాదులను అందుకున్నారు. బహిరంగ సభలు నిర్వహిస్తూ, వివిధ సామాజికవర్గాలతో ఆత్మీయ సమావేశాలు జరిపారు.
మెల్లిగా ఊపందుకున్న పాదయాత్ర
రాయలసీమలోని నాలుగు జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో పాదయాత్ర పూర్తయింది. నెల్లూరు జిల్లాతో కోస్తా జిల్లాల పర్యటన మొదలుపెట్టారు. నెల్లూరు జిల్లా తర్వాత ప్రకాశం, అక్కడి నుండి గుంటూరు, తర్వాత కృష్ణా జిల్లాలో పాదయాత్ర పూర్తి చేశారు. ఆ జిల్లాలో నుండి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి ఇపుడు తూర్పులో తిరుగుతున్నారు. పాదయాత్రను మొదలుపెట్టిన నాటితో పోల్చుకుంటే జగన్ యాత్రలో జనాలు ఇపుడు చాలా సానుకూలంగా స్పందించటం అందరూ చూస్తున్నదే. మొత్తానికి జగన్ పాదయత్ర రోజు రోజుకు పుంజుకుంటోందన్నది వాస్తవం. తూర్పు తర్వాత ఉత్తరాంధ్రలోకి ప్రవేశించనున్నారు. పాదయాత్రలో కవర్ చేయని జిల్లాలను త్వరలో బస్సుయాత్ర ద్వారా జగన్ కవర్ చేస్తారు.