విజయవాడ కేంద్రంగా జనసేన పార్టీ చంద్రబాబునాయుడుపై ఫ్లెక్సీల యుద్దానికి తెరలేపినట్లే కనబడుతోంది. తాజాగా విజయవాడ నడిబొడ్డున వెలసిన ఓ ఫ్లెక్సీ తమ్ముళ్ళ దుమ్ములేపేస్తోంది. కొంతకాలంగా విజయవాడ కేంద్రంగా తెలుగుదేశంపార్టీ ప్రత్యర్ధులపై ఫ్లెక్సీ యుద్ధానికి తెరలేపిన విషయం అందరికీ తెలిసిందే. ఇంతకాలం బిజెపి, జనసేనలపై తెలుగుదేశంపార్టీ నేత కాట్రగడ్డ ప్రసాద్ పేరుతో ఫ్లెక్సీలు వెలిసేవి. తాజాగా  జనసేన పేరుతో వెలసిన ఫ్లెక్సీ మాత్రం తమ్ముళ్ళ పరువు తీసేస్తోంది. అందులోని కంటెంట్ చదివిన వారికి అందులో తప్పేమీ లేదని అనిపించేట్లుగా ఉంది. జనాల్లో టిడిపిపై ప్రబలిన వ్యతిరేకతకు జనసేన ఫ్లెక్సీ నిలువుటద్దంగా కనిపిస్తోంది.

 

ఫ్లెక్సీలో పిచ్చి ముదిరిన పచ్చ పురాణం..ఏం తమ్ముళ్ళూ వేధిస్తోందా ?..ఓటమి భయం, గుర్తుస్తోందా ? దశాబ్ద ప్రతిపక్ష కాలం..అంటూ నిలదీశారు. టిడిపి పదేళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్న విషయాన్ని జనసేన ఫ్లెక్సీ గుర్తుచేసింది. 2009లో బెజవాడ గడ్డమీద మీరు జీరో అంటూ చంద్రబాబును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలే చేశారు. 2014లో ఎలా అయ్యారు హీరో అంటూ నిలదీశారు.

 

2014లో హీరో అయ్యింది మీ నాయకుడి (చంద్రబాబు) తంత్ర ఫలమా లేకపోతే తమ నాయకుడి (పవన్ కల్యాణ్)కాళ్ళు మొక్కిన ఫలమా అంటూ ఎద్దేవా చేశారు. 2019లో ఓటమి భయంతోనే చంద్రబాబు కాంగ్రెస్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నారంటూ మండిపోయారు. పనిలో పనిగా టిడిపికి మద్దతుగా నిలబడే ఎల్లో మీడియాను కూడా ఓ రేంజిలో దుయ్యబట్టారు. 2019లో తెలుగుదేశంపార్టీకి బుద్ది చెప్పకపోతే తాము జనసైనికులమే కాదంటూ తీవ్ర ప్రతిజ్ఞే చేశారు. తెలుగు తమ్ముళ్ళూ మీకు గోదావరి జిల్లాల్లోనే మొదలైంది కౌంట్ డౌన్ అంటూ తీవ్ర హెచ్చరికలే చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: