గత వారం రోజుల నుంచి తెలంగాణ ఇంటర్ బోర్డు వద్ద రగడ కొనసాగుతూనే ఉంది. ఒక గ్లొమరీనా లాంటి ప్రైవేట్ సంస్థకు విద్యార్ధుల భవిష్యత్ ని తాకట్టు పెట్టారా అని విద్యార్థిలోకం..తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఇప్పటికే పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే అవమానంతో 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పపడ్డారు.
ఇంటర్ ఫలితాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు. బాధ్యులెవరైనా శిక్ష తప్పదని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. అంతే కాదు రి వేరిఫికేషన్, వాల్యూవేషన్ ఫ్రీగా జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే తెలంగాణ ఇంటర్ ఫలితాలపై గందరగోళం నేపథ్యంలో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నేడు తమ నివేదిక సమర్పించింది. ప్రభుత్వానికి 10 పేజీల నివేదికను అందజేసినట్లు కమిటీ ఛైర్మన్ వెంకటేశ్వరరావు వెల్లడించారు. అన్ని విషయాలను నివేదికలో పొందుపరిచామని, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలను కూడా అందులో వివరించామని ఆయన అన్నారు.
కమిటీ ఇచ్చిన నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉందని, నివేదికను పరిశీలించిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించిన నివేదికను తెలంగాణ సీఎస్ జోషికి కమిటీ సభ్యులు కొద్ది సేపటి క్రితం అందజేశారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం, గ్లోబరినా సంస్థ వైఫల్యమే కారణమని పన్నెండు పేజీల నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం.
అనుభవం లేకపోవడం వల్లనే ఫలితాల్లో సాంకేతిక సమస్యలు వచ్చాయని నిర్థారించారు. ఇలాంటి తప్పిదాల వల్ల సున్నితమైన విద్యార్థుల మనసు వికలం అవడం..ఆత్మహత్యలకు పాల్పపడటం లాంటివి జరుగుతాయని... భవిష్యత్ లో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ నివేదికలో కమిటీ సూచించినట్టు సమాచారం.